ఐపీఎల్‌ 2020 : ఆర్‌సీబీ, కేకేఆర్‌ల మధ్య తొలి మ్యాచ్‌..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Sep 2020 10:20 AM GMT
ఐపీఎల్‌ 2020 : ఆర్‌సీబీ, కేకేఆర్‌ల మధ్య తొలి మ్యాచ్‌..?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) కోసం క్రికెట్‌ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చిలో ప్రారంభం కావాల్సి ఉన్నా.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి 13వ సీజన్‌ ప్రారంభం కానుందని బీసీసీఐ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే అన్ని జట్లు యూఏఈ చేరుకుని ప్రాక్టీస్‌ కూడా మొదలెట్టాయి. కాగా.. ఇంత వరకు ఈ సీజన్‌ షెడ్యూల్‌ను విడుదల చేయలేదు.

గతేడాది ఫైనల్‌కు చేరిన జట్లతోనే ఏటా టోర్నీ ఆరంభ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఇప్పటి వరకు అది ఆనవాయితిగా వస్తోంది. గతేడాది పైనల్‌లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు ఫైనల్‌ మ్యాచ్‌ ఆడాయి. దీంతో ఈ సారి ఆరంభ మ్యాచ్‌లో ఈ ఇద్దరు తలపడాల్సి ఉంది. అయితే.. ఇటీవల చెన్నై జట్టులో కరోనా కలకలం రేపింది. ఆ జట్టు ఇద్దరు ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది కలిపి మొత్తం 13 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ జట్టు క్వారంటైన్‌ గడువును పెంచారు. అంతేకాకుండా రైనా, భజ్జీలాంటి స్టార్‌ ఆటగాళ్లు ఆ జట్టుకు దూరం అయ్యారు. దీంతో చెన్నై జట్టు మొదటి మ్యాచ్‌లో ఆడేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. దీంతో షెడ్యూల్‌ను మార్పులు చోటు చేసుకున్నాయని.. అందుకనే షెడ్యూల్‌ విడుదల ఆలస్యం అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే శనివారం ఐపీఎల్‌ నిర్వాహకులు ట్విట్టర్‌లో ఓ ఆసక్తికర పోస్టర్‌ను విడుదల చేశారు. 'డ్రీమ్‌ 11 ఐపీఎల్‌కు ఇంకా 14 రోజులే మిగిలి ఉన్నాయి. ఆగలేకపోతున్నాం.' అని పేర్కొంటూ.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్లు విరాట్‌ కోహ్లీ, దినేశ్‌ కార్తిక్‌ల ఫోటోలను పంచుకున్నారు. దీంతో ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా.. అధికారిక షెడ్యూల్‌ ఇంకా విడుదల కాలేదు. షెడ్యూల్‌ విడుదల అయిన తరువాతనే ఎవరు తొలి మ్యాచ్‌లో తలపడతారు అనే విషయం తెలుస్తాది.



Next Story