వూహాన్లో డబ్ల్యూహెచ్వో బృందం పర్యటన.. కీలక ఆధారాలు లభ్యం
WHO continues probe into initial coronavirus spread in Wuhan, finds key clues into the role of the seafood market. వూహాన్లో డబ్ల్యూహెచ్వో బృందం పర్యటన.. కీలక ఆధారాలు లభ్యం
By Medi Samrat Published on 9 Feb 2021 4:26 AM GMT
చైనాలోని వూహాన్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) బృందం పర్యటిస్తోంది. కరోనా మూలాలను కనిపెట్టేందుకు 14 మందితో కూడిన శాస్త్రవేత్తల బృందం గత రెండు వారాలుగా వూహాన్లో పర్యటిస్తోంది. అయితే.. కరోనా వైరస్ చైనాలోని వూహాన్లో పుట్టిందని, అక్కడి నుంచే ప్రపంచ దేశాలకు పాకిందని చాలా కాలం నుంచి ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాలో డబ్ల్యూహెచ్వో పర్యటించాలని ఒత్తిడి తీసుకురావడంతో బృందం సభ్యులు వూహాన్లో పర్యటిస్తున్నారు.
దీంతో గత రెండు వారాలకుపైగా డబ్ల్యూహెచ్వో శాస్త్రవేత్తల బృందం చైనాలో పర్యటిస్తోంది. అయితే చైనాపై వస్తున్న ఆరోపణలను సైతం చైనా ఖండిస్తూ వస్తోంది. అయితే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా పలు పలు దేశాల శాస్త్రవేత్తలు వూహాన్ ల్యాబ్లోనే కరోనా వైరస్ పుట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వూహాన్లో పర్యటిస్తున్న డబ్ల్యూహెచ్వో నిపుణుల బృందం కరోనా మహమ్మారి పుట్టిక, వ్యాప్తికి సంబంధించి వివరాలు, ఆధారాల సేకరిస్తోంది. కరోనా వ్యాప్తిలో వూహాన్ సీపుడ్ మార్కెట్ ప్రాత్రకు సంబంధించి ముఖ్య ఆధారాలు లభ్యమైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం సభ్యుడు పీటర్ డెస్జాక్ సోషల్ మీడియాల్లో ప్రకటించారు. ఫిబ్రవరి 10న పర్యటన ముగింపు ఉంటుందని, తాము తిరిగి వెళ్లేలోపు ఇందుకు సంబంధించిన ముఖ్యాంశాలు వెల్లడించే అవకాశం ఉందని న్యూయార్క్కు చెందిన శాస్త్రవేత్త వివరించారు.
ఈ బృందం వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలతో కూడా సమావేశం అయింది. అలాగే మొదట్లో కరోనా వ్యాప్తి చెందిన సమయంలో కరోనా పేషెంట్లకు వైద్యం అందించిన ఆస్పత్రులను సైతం పరిశీలించి అక్కడి వైద్యులతో పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ రూపొందించిన ప్రయోగశాల అంటూ అంతర్జాతీయ మీడియా ఆరోపించిన వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, వూహాన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ను సందర్శిస్తున్నారు.