హార్ముజ్ జలసంధి గుండా ఇరాన్ భారత ట్యాంకర్లను ఎందుకు అనుమతించిందో చెప్పిన విదేశాంగ మంత్రి..!
By - Medi Samrat |
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడి తర్వాత మధ్యప్రాచ్యంలో యుద్ధం మొదలైంది. ఇరాన్ హార్ముజ్ జలసంధిని ఆక్రమించుకుంది. ఈ సముద్ర మార్గాన్ని అడ్డుకుంది. అయితే.. టెహ్రాన్ భారత ట్యాంకర్లను ఈ మార్గం గుండా వెళ్ళడానికి అనుమతించిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు.
చర్చలు మాత్రమే ఫలితాలను ఇస్తాయని, అది నిరంతర ప్రక్రియ అని విదేశాంగ మంత్రి అన్నారు. ఫైనాన్షియల్ టైమ్స్తో మాట్లాడుతూ.. "నేను ప్రస్తుతం వారితో సంభాషణలో నిమగ్నమై ఉన్నాను, ఈ చర్చలు కొన్ని ఫలితాలను ఇచ్చాయి. ఈ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. దీని నుండి ఫలితాలు వస్తున్నట్లు అనిపిస్తే, నేను స్పష్టంగా ఈ చర్చలను కొనసాగిస్తాను" అని అన్నారు.
"ఖచ్చితంగా భారత్ దృక్కోణం నుండి మనం చర్చించడం, సమన్వయం చేసుకోవడం, పరిష్కారం కనుగొనడం మంచిది" అని ఆయన అన్నారు. భారత జెండా ఉన్న నౌకల కోసం ఇరాన్తో సమగ్ర ఒప్పందం లేదని.. నౌకల ప్రతి కదలిక వ్యక్తిగత సంఘటన అని విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ఇరాన్ కు ప్రతిఫలంగా ఏమీ అందలేదని కూడా ఆయన ఖండించారు. ఢిల్లీ, టెహ్రాన్ లు ఒకదానితో ఒకటి వ్యవహరించే చరిత్ర కలిగి ఉన్నాయని, దాని ఆధారంగానే వారు చర్చలు జరిపారని జైశంకర్ అన్నారు.
"ఇది మార్పిడికి సంబంధించిన విషయం కాదు. భారత్, ఇరాన్ సంబంధాలు ఉన్నాయి. ఈ సంఘర్షణను మేము చాలా దురదృష్టకరమని భావిస్తున్నాము" అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. డాక్టర్ జైశంకర్ మాట్లాడుతూ.. ఇది ప్రారంభం మాత్రమే.. మనవి చాలా నౌకలు ఉన్నాయి.. కాబట్టి, ఇది స్వాగతించదగిన దశ అయినప్పటికీ, చర్చలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా చోక్పాయింట్గా మారిన హార్ముజ్ జలసంధి గుండా ద్రవీకృత పెట్రోలియం వాయువును మోసుకెళ్తున్న రెండు భారతీయ జెండా కలిగిన ట్యాంకర్లు సురక్షితంగా వెళ్ళాయి. పర్షియన్ గల్ఫ్ నుండి అరేబియా సముద్రానికి జలసంధి ఏకైక మార్గం.