అమృత్సర్కు చేరుకోనున్న అక్రమ వలసదారుల విమానం.. ప్రధానిపై సీఎం ఫైర్
అమెరికా నుంచి బహిష్కరణకు గురైన 277 మంది భారతీయులు శని, ఆదివారాల్లో విమానంలో అమృత్సర్కు తీసుకురానున్నారు.
By Medi Samrat Published on 15 Feb 2025 8:46 AM IST
అమెరికా నుంచి బహిష్కరణకు గురైన 277 మంది భారతీయులు శని, ఆదివారాల్లో విమానంలో అమృత్సర్కు తీసుకురానున్నారు. ఈరోజు రెండో విమానం అమెరికా నుంచి భారత్కు రానుంది. అమృత్సర్లో భారతీయులను తీసుకొచ్చే విమానం ల్యాండింగ్పై పంజాబ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా నుంచి వస్తున్న విమానాలను హిండన్, అహ్మదాబాద్ లేదా ఘజియాబాద్లోని అంబాలాలో ఎందుకు ల్యాండ్ చేయడం లేదని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పంజాబ్, పంజాబీలను కించపరిచే కుట్రలో భాగంగానే ఇది జరుగుతోందని ఆరోపించారు. శనివారం 120 మంది, ఆదివారం 157 మంది భారతీయులను అమెరికా నుంచి బహిష్కరించడం గమనార్హం. వీరందరినీ ప్రత్యేక విమానంలో అమృత్సర్లోని శ్రీ గురు రాందాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
శుక్రవారం అమృత్సర్కు చేరుకున్న ముఖ్యమంత్రి మాన్ విలేకరులతో మాట్లాడుతూ,.. అమృత్సర్లో ఈ విమానాలను ల్యాండ్ చేయడానికి ప్రమాణాలు ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పంజాబీలు అంటే అస్సలు ఇష్టం లేదని, అందుకే పవిత్ర నగరమైన అమృత్సర్ను నిర్వాసిత కేంద్రంగా మారుస్తున్నారని ఆరోపించారు. బహిష్కరణకు గురైన వారిని మోదీ బహుమతిగా తీసుకువస్తున్నారా అని మన్ ప్రశ్నించారు. బహిష్కరణకు గురైన వారిని మోదీ తనతో పాటు బహుమతిగా తీసుకువస్తున్నారా? కొలంబియా వంటి దేశం తన ప్రజలను తిరిగి తీసుకురావడానికి ఓడలను పంపగలిగితే, భారతదేశం ఎందుకు చేయలేకపోయింది? అని ప్రశ్నించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా విమానాన్ని హిండన్ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేయగలిగినప్పుడు.. బహిష్కరణకు గురైన వారి విమానాన్ని ఎందుకు ల్యాండ్ చేయలేరని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
శనివారం బహిష్కరణకు గురైన 120 మంది భారతీయుల్లో ఆరు నుంచి 46 ఏళ్ల మధ్య వయసున్న వారు ఉన్నారు. వీరిలో 67 మంది పంజాబీలు, హర్యానా నుంచి 33 మంది, గుజరాత్ నుంచి 8 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి ముగ్గురు, మహారాష్ట్ర నుంచి ఇద్దరు, రాజస్థాన్ నుంచి ఇద్దరు, గోవా నుంచి ఇద్దరు, హిమాచల్ నుంచి ఇద్దరు, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒకరు ఉన్నారు. అదేవిధంగా, ఆదివారం కూడా అమెరికా 157 మంది భారతీయులను బహిష్కరిస్తుంది. ఇందులో నాలుగు నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఉన్నారు. వారందరినీ విమానంలో అమృత్సర్కు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
అంతకుముందు ఫిబ్రవరి 5న అమెరికా సైనిక విమానం 104 మంది బహిష్కరణకు గురైన భారతీయులతో అమృత్సర్కు చేరుకుంది. ఈ బహిష్కరణకు గురైన వారిలో 30 మంది పంజాబ్కు చెందిన వారు. దేశ బహిష్కరణకు గురైన వారి చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు కట్టేసి తీసుకురావడంపై దేశంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ అంశాన్ని విపక్షాలు కూడా పార్లమెంట్లో లేవనెత్తాయి.