బంగ్లాదేశ్ పర్యటనలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

President Ramnath Kovind Bangladesh Visit. భార‌త రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం బంగ్లాదేశ్ రాజ‌ధాని

By Medi Samrat  Published on  15 Dec 2021 1:16 PM GMT
బంగ్లాదేశ్ పర్యటనలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

భార‌త రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం బంగ్లాదేశ్ రాజ‌ధాని ఢాకా చేరుకున్నారు. కోవింద్‌కు అక్క‌డి సైన్యం ఘ‌న స్వాగ‌తం ప‌లికింది. రాష్ట్రపతి సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఢాకాలో నిర్వహిస్తున్న బంగ్లాదేశ్ 50వ విజయోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలు జరుపుకుంటోన్న నేప‌థ్యంలో కోవింద్ ఆ దేశంలో ప‌ర్య‌టిస్తున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బుధవారం ఢాకా చేరుకున్నారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, ప్రథమ మహిళ రషీదా హమీద్ ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్రపతి కోవింద్ డిసెంబరు 15-17 మూడు రోజుల బంగ్లాదేశ్ పర్యటనలో గౌరవ అతిథిగా దేశం యొక్క 50 వ విజయోత్సవ వేడుకలకు హాజరుకానున్నారు.

భారత్, బంగ్లాదేశ్ ల మధ్య 50 ఏళ్లుగా దౌత్య సంబంధాలు కొన‌సాగుతున్నాయి. 1971 డిసెంబరు 16న పాకిస్థాన్ సైన్యంపై భారత్, బంగ్లాదేశ్ బలగాలు విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశంలో కోవింద్ పాల్గొంటారు. అనంత‌రం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ తోనూ ఆయ‌న‌ భేటీ అవుతారు. కరోనా వ్యాప్తి మొదలైన అనంత‌రం భా‌ర‌త రాష్ట్రపతి చేపడుతోన్న తొలి విదేశీ పర్యటన ఇదే. రాష్ట్రపతి పర్యటన ఢాకాతో భారతదేశ బంధాలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిస్తుందని, భాగస్వామ్య భౌగోళిక స్థలం, వారసత్వం, చరిత్ర, బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో బంగ్లాదేశ్‌కు భారత్ అందించిన మద్దతు యొక్క భాగస్వామ్య అనుభవంపై సంబంధాలు ఆధారపడి ఉన్నాయని భారత ప్రభుత్వం తెలిపింది.


Next Story