జ‌పాన్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత మిజోకామీని క‌లిసిన ప్రధాని మోదీ

PM Modi Interacted With Padma Shri Dr. Tomio Mizokami In Hiroshima. జీ-7 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లోని హిరోషిమా చేరుకున్నారు.

By Medi Samrat  Published on  20 May 2023 6:46 AM GMT
జ‌పాన్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత మిజోకామీని క‌లిసిన ప్రధాని మోదీ

జీ-7 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లోని హిరోషిమా చేరుకున్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు ఆయన హిరోషిమాకు వెళ్లారు. జపాన్ ప్రస్తుత అధ్యక్షుడిగా G-7 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. భారతదేశాన్ని అతిథి దేశంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత జపాన్ రచయిత పద్మశ్రీ డాక్టర్ టోమియో మిజోకామి ని ప్రధాని మోదీ కలిశారు.

ప్రధాని మోదీ, మిజోకామీ మధ్య సంభాషణ జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. జపాన్‌లో భారతీయ సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో, రెండు దేశాలను మరింత దగ్గర చేయడంలో మిజోకామి చేసిన కృషికి ప్రధాని ప్రశంసించారు. హిరోషిమాలో ప్రొఫెసర్ టోమియో మిజోకామితో సంభాషించడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయ‌న‌ ప్రముఖ హిందీ, పంజాబీ భాషావేత్త. టోమియో మిజోకామి జపాన్ ప్రజలలో భారతీయ సంస్కృతి, సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేశారు.

టోమియో మిజోకామీ మే 12, 1941న జన్మించిన తన రచనలతో జపాన్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. టోమియో మిజోకామి ప్రస్తుతం జపాన్‌లోని ఒసాకా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఎమెరిటస్‌గా పనిచేస్తున్నారు. 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుండి 'లాంగ్వేజ్ కాంటాక్ట్ ఇన్ పంజాబ్ - ఎ సోషియోలింగ్విస్టిక్ స్టడీ ఆఫ్ మైగ్రెంట్స్' లాంగ్వేజెస్' అనే సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ చేశారు.

2018 సంవత్సరంలో మిజోకామీని భారతదేశం ఆహ్వానించింది. ఆయ‌న‌ను భారతదేశ నాల్గవ అత్యున్నత పౌర గౌరవం పద్మశ్రీతో సత్కరించింది. సాహిత్యం, విద్యా రంగంలో ఆయన చేసిన కృషికి 2 ఏప్రిల్ 2018న అప్ప‌టి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయనను పద్మశ్రీతో సత్కరించారు.

అలాగే.. జపాన్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు హిరోకో తకయామాతో కూడా ప్రధాని మోదీ సంభాషించారు. భారతదేశంతో సన్నిహిత సంబంధాలు ఉన్న కళాకారుడు హిరోకో తకయామాను తాను కలిశానని ప్రధాని చెప్పారు. భారతదేశం, జపాన్ మధ్య సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడానికి తకయామా విస్తృతంగా కృషి చేశారని మోదీ అన్నారు. హిరోకో ఈ సమావేశంలో ప్రధాని మోదీకి తన కళాఖండాన్ని బ‌హుక‌రించారు.

జపాన్ చిత్రకారుడు హిరోకో తకయామా భారత ప్రధాని మోదీతో తన భేటీ గురించి చెప్పారు. నా పెయింటింగ్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారని అన్నారు. ఆమె చాలా అందంగా ఉందని చెప్పాడు. 42 ఏళ్ల క్రితం నేను తొలిసారి భారత్‌కు వచ్చానని తకయామా తెలిపారు. భారత భూమిపై నివసించే ప్రజల స్ఫూర్తికి నేను చాలా ఆకర్శితుడ‌న‌య్యానన్నారు.


Next Story