రోజుల తరబడి సైనిక ఘర్షణ తర్వాత భారతదేశం, పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న వారాల తరువాత, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మాట్లాడుతూ, ఇస్లామాబాద్ "దక్షిణాసియా ప్రాంతంలో భారత ఆధిపత్యాన్ని ఎప్పటికీ అంగీకరించదు", సింధు జల ఒప్పంద అంశంపై ఎప్పుడూ రాజీపడదు , ఎందుకంటే ఇది దేశంలోని 240 మిలియన్ల పౌరుల ప్రాథమిక హక్కులతో నేరుగా ముడిపడి ఉంది అని అన్నారు.
పాకిస్తాన్ మిలిటరీ మీడియా విభాగం ప్రకారం.. వివిధ విశ్వవిద్యాలయాల వైస్-ఛాన్సలర్లు, ప్రిన్సిపాల్స్, సీనియర్ టీచర్లు,విద్యావేత్తలతో జరిగిన చర్చలో మునీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. "భారత ఆధిపత్యాన్ని పాకిస్తాన్ ఎప్పటికీ అంగీకరించదు" అని మునీర్ గురువారం చెప్పారని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపింది. సింధు జల ఒప్పందాన్ని (IWT) నిలిపివేయాలన్న భారతదేశం చర్యకు ప్రతిస్పందిస్తూ, మునీర్ దీనిని పాకిస్తాన్కు "రెడ్ లైన్" అని అభివర్ణించాడు. నీటికి సంబంధించిన విషయాలలో ఇస్లామాబాద్ "ఎప్పటికీ లొంగదు" అని అన్నాడు.
"పాకిస్తాన్ కు నీరు అనేది రెడ్ లైన్. 240 మిలియన్ల పాకిస్తానీయుల ఈ ప్రాథమిక హక్కుపై మేము ఎటువంటి రాజీని అనుమతించము" అని మునీర్ అన్నారు.
కాశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను చంపిన ఒక రోజు తర్వాత , ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS), 1960లో సంతకం చేసిన తర్వాత మొదటిసారిగా సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది.
వాస్తవానికి, భారతదేశం నీటిని పంచుకోవడమే కాకుండా, IWTలో భాగంగా నీటి వ్యవస్థలను నిర్మించడంలో సహాయం చేయడానికి పాకిస్తాన్తో లక్షలాది రూపాయలను పంచుకుంది.