ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. దీని ఎత్తు 8,848 మీటర్లు. అయితే.. 2015లో వచ్చిన భూకంపంతో దీని ఎత్తు తగ్గిపోయిందన్న ఊహానాగాల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం ఏడాది పాటు సర్వే చేపట్టింది. ఇందుకోసం చైనా సాయం తీసుకుంది. 2019లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నేపాల్ పర్యటన సందర్భంగా ఎవరెస్ట్.. కొత్త ఎత్తును సంయుక్తంగా ప్రకటించేందుకు ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
హిమాలయాల్లో ఉన్న ఎవరెస్ట్ శిఖరం తాజా ఎత్తును నేపాల్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. తాజా లెక్కల ప్రకారం ఈ పర్వతం ఎత్తు 8,848.86 మీటర్లు ఉందని తెలిపింది. సర్వేల ద్వారా ఎవరెస్ట్ ఎత్తులో ఎలాంటి తరుగుదల చోటుచేసుకోలేదని వెల్లడైంది. ఈ పర్వతం ఎత్తును భారత ప్రభుత్వం 1954లో కొలిచినపుడు 8,848 మీటర్లు అని నిర్థరణ అయింది. ప్రపంచవ్యాప్తంగా దీనినే విస్తృతంగా ఆమోదిస్తున్నారు. నేపాల్ తాజా ప్రకటనలో 86 సెంమీ మేర ఎత్తు పెరిగినట్టు వెల్లడైంది. ఈ మధ్యకాలంలో మౌంట్ ఎవరెస్టు ఎత్తును కొలవడం ఇదే తొలిసారి. తాజా గణంకాల ప్రకారం దీని ఎత్తు స్వల్పంగా పెరిగినట్లు నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యావలి స్పష్టం చేశారు.