ఖురాన్‌ను అపవిత్రం చేశాడని.. వ్యక్తి కాల్చి చంపి, ఆపై మృతదేహాన్ని వేలాడదీసి..

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని సుందరమైన స్వాత్ జిల్లాలో పవిత్ర ఖురాన్‌ను అపవిత్రం చేశాడని తెలుసుకుని, ఆగ్రహానికి గురైన గుంపు ఓ వ్యక్తిని హతమార్చింది.

By అంజి  Published on  21 Jun 2024 8:15 AM GMT
Pakistan, Quran, Crime news

ఖురాన్‌ను అపవిత్రం చేశాడని.. వ్యక్తి కాల్చి చంపి, ఆపై మృతదేహాన్ని వేలాడదీసి..

వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని సుందరమైన స్వాత్ జిల్లాలో పవిత్ర ఖురాన్‌ను అపవిత్రం చేశాడని తెలుసుకుని, ఆగ్రహానికి గురైన గుంపు ఓ వ్యక్తిని హతమార్చిందని, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పంజాబ్‌లోని సియాల్‌కోట్ జిల్లాకు చెందిన వ్యక్తి గురువారం రాత్రి స్వాత్‌లోని మద్యన్ తహసీల్‌లో పవిత్ర ఖురాన్‌లోని కొన్ని పేజీలను తగలబెట్టాడని స్వాత్‌ జిల్లా పోలీసు అధికారి (డిపిఓ) జహిదుల్లా తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని మద్యన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్ బయట గుమికూడిన గుంపు అతడిని అప్పగించాలని డిమాండ్ చేసింది. పోలీసులు అందుకు నిరాకరించడంతో గుంపు కాల్పులు జరపగా, పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని, అతన్ని మద్యన్ ఆసుపత్రికి తరలించామని డిపిఓ తెలిపారు.

ఆ తర్వాత ఆ గుంపు పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టారు. అనంతరం కొందరు వ్యక్తులు పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి నిందితుడిని కాల్చి చంపి మృతదేహాన్ని మద్యన్ అడ్డాకు ఈడ్చుకెళ్లి అక్కడ ఉరివేశారని జహీదుల్లా తెలిపారు. ఈ ఘటనతో చెలరేగిన ఆందోళనలో ఎనిమిది మంది గాయపడ్డారు. మద్యన్‌లో భారీగా పోలీసులను మోహరించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కెపికె అలీ అమీన్ గండాపూర్ అపవిత్ర ఘటనపై దృష్టి సారించారు. ప్రాంతీయ పోలీసు చీఫ్ నుండి నివేదిక కోరారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలని, ప్రజలు ప్రశాంతంగా, శాంతియుతంగా ఉండాలని సీఎం ఐజీపీని ఆదేశించారు.

Next Story