గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పిన ఇరాన్ ప్రెసిడెంట్
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇరాన్ దళాలు పొరుగు దేశాలపై జరిపిన దాడులకు క్షమాపణలు చెప్పారు.
By - Knakam Karthik |
గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పిన ఇరాన్ ప్రెసిడెంట్
అమెరికా కోరుతున్న 'నిబంధనలు లేని లొంగుబాటు' అనేది వారు తమ సమాధి వరకు తీసుకెళ్లాల్సిన కల మాత్రమేనని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేట్ టెలివిజన్ ద్వారా ప్రసారమైన ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో ఇరాన్ దళాలు పొరుగు దేశాలపై జరిపిన దాడులకు క్షమాపణలు చెప్పారు. కమాండ్ అండ్ కంట్రోల్ వైఫల్యం వల్లే ఈ పొరపాట్లు జరిగాయని, ఇకపై దాడులను నిలిపివేస్తామని ఆయన సూచించారు. దేశ సుప్రీం లీడర్ మరియు ఇతర ఉన్నతాధికారుల మరణం కారణంగా సాయుధ దళాలలో గందరగోళం నెలకొందని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, ఇరాన్ తన క్షిపణి సాంకేతికతతో అమెరికా స్థావరాలపై 'ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4'ను ప్రారంభించగా, దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ 80కి పైగా యుద్ధ విమానాలతో టెహ్రాన్ మరియు మధ్య ఇరాన్లోని క్షిపణి లాంచర్లపై విరుచుకుపడింది. ఈ యుద్ధంలో రష్యా సైతం ఇరాన్కు సహకరిస్తూ అమెరికా యుద్ధనౌకల సమాచారాన్ని అందిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్ షరతులు లేని లొంగుబాటుకు డిమాండ్ చేస్తూ చర్చలకు తావులేదని స్పష్టం చేశారు. ఈ భీకర దాడుల కారణంగా ఇరాన్లో 1,230 మంది, లెబనాన్లో 200 మందికి పైగా మరణించారు. ఒక పాఠశాల పై జరిగిన దాడిలో అనేకమంది విద్యార్థులు చనిపోగా, అది అమెరికా వైమానిక దాడి అయి ఉండవచ్చని ఆధారాలు సూచిస్తున్నాయి.