Facebook fears the WhatsApp privacy policy row may hurt its future. వాట్సాప్ లో ఇటీవల ప్రైవసీకి సంబంధించి కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పగానే.. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
By Medi Samrat Published on 12 Feb 2021 12:02 PM GMT
వాట్సాప్ లో ఇటీవల ప్రైవసీకి సంబంధించి కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పగానే.. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా వేరే యాప్ ఉపయోగించండి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వాట్సాప్ ఏకంగా అందరి మెసేజీలు చదివేస్తోంది అంటూ ప్రచారం కూడా చేసేశారు. చివరికి తాము అనుకున్నది కూడా అమలు చేయలేకపోయింది. దీనిపై వాట్సాప్ సంస్థ బాధను వ్యక్తం చేసింది.
నూతన ప్రైవసీ పాలసీ యూజర్ల వ్యక్తిగత సమాచార భద్రతకు వ్యతిరేకంగా ఉందని వచ్చిన వ్యాఖ్యలపై వాట్సాప్ మాతృసంస్థ ఫేస్ బుక్ వివరణ ఇచ్చింది. ఫేస్ బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ ఓ కార్యక్రమంలో వాట్సాప్ ప్రైవసీ పాలసీ గురించి మాట్లాడారు. ప్రైవసీ పాలసీపై తాము మరికొంచెం వివరణాత్మకంగా చెబితే బాగుండేదని.. వ్యక్తిగత సమాచారం ఎన్ క్రిప్షన్ చేయడంలో వాట్సాప్ నిబద్ధతను ఎవరూ అనుమానించలేరని అన్నారు. తామేమీ యూజర్ల సందేశాలను చదవబోమని, ఏ ఒక్కరి సందేశాలను తాము వీక్షించబోమని మరోసారి స్పష్టం చేశారు.
ఇతరులెవ్వరూ కూడా యూజర్ల సందేశాల్లోకి తొంగి చూసే అవకాశం లేదని, ప్రైవసీ పాలసీలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేశామో అందరికీ అర్థమయ్యేలా వివరించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్పికొచ్చారు. ఓ బాధ్యతాయుతమైన సంస్థగా భారత చట్టాలను తాము గౌరవిస్తామని, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ వంటి తమ వేదికలను పెద్దసంఖ్యలో భారతీయులు వినియోగిస్తున్నారని వెల్లడించారు. తమ వేదికలను దుర్వినియోగపర్చడాన్ని తాము కోరుకోవడంలేదని అన్నారు. ఫేక్ న్యూస్ విషయంలో తాము ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉన్నామని చెప్పుకొచ్చారు.