భారత్‌లో టెస్లా సేవల ప్రారంభంపై.. ఎలాన్‌ మస్క్ ఏమన్నారంటే?

అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ప్రపంచలోనే అత్యంత ధనవంతుడు

By అంజి  Published on  21 Jun 2023 7:05 AM GMT
Elon Musk, Indian Prime Minister Modi, America, international news

భారత్‌లో టెస్లా సేవల ప్రారంభంపై.. ఎలాన్‌ మస్క్ ఏమన్నారంటే?

అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ప్రపంచలోనే అత్యంత ధనవంతుడు, ట్విటర్‌ యాజమాని, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ భేటీ అయ్యారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ మంగళవారం న్యూయార్క్‌ చేరుకున్నారు. ప్రధాని మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలోనే న్యూయార్క్‌లో ప్రధాని మోదీతో ఎలాన్‌ మస్క్‌ భేటీ అయ్యారు. భేటీ తర్వాత ఎలాన్‌ మస్క్‌ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. ''నేను మోదీకి అభిమానిని'' అని మోదీని కలిసిన తర్వాత ఎలాన్ మస్క్ చెప్పారు. త్వరలోనే భారత్‌లో టెస్లా సేవలు మొదలుపెడతామన్నారు.

వీలైనంత త్వరగా సేవలు మొదలుపెట్టేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. పెట్టుబడుల విషయమై సరైన సమయంలో ప్రకటన చేస్తామన్నారు. ఈ విషయంలో మద్దతు ఇస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి తాను థ్యాంక్స్‌ చెబుతున్నానని తెలిపారు. ప్రధాని మోదీతో చర్చ అద్భుతంగా సాగిందని, భారత్‌లో తమ పెట్టుబడులు గణనీయంగా ఉండబోతున్నాయని మస్క్ అన్నారు. భారత్‌ పట్ల ప్రధాని మోదీ నిజమైన శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. భారత్‌లో సోలార్‌ ఎనర్జీ పెట్టుబడులకు ఎంతో ఆస్కారం ఉందని, స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ను తీసుకెళ్లాలనుకుంటున్నామని ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. పర్యటనలో భాగంగా ప్రముఖ సీఈవోలతో మోదీ భేటీ అవుతున్నారు. దీనిలో భాగంగానే ఎలాన్ మస్క్‌ను కూడా కలిశారు.

Next Story