కొన్నిసార్లు చట్టం మానవత్వం ముందు తలవంచాల్సి వస్తుంది : సుప్రీం

బంగ్లాదేశీయురాల‌న్న అనుమానంతో సోనాలి ఖాతూన్‌తో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులను జూన్ 27న బంగ్లాదేశ్‌కు పంపారు.

By -  Medi Samrat
Published on : 3 Dec 2025 4:17 PM IST

కొన్నిసార్లు చట్టం మానవత్వం ముందు తలవంచాల్సి వస్తుంది : సుప్రీం

బంగ్లాదేశీయురాల‌న్న అనుమానంతో సోనాలి ఖాతూన్‌తో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులను జూన్ 27న బంగ్లాదేశ్‌కు పంపారు. ఇప్పుడు భారత్‌కు రావడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. మానవతా ప్రాతిపదికన.. బంగ్లాదేశ్ నుండి తొమ్మిది నెలల గర్భిణి సోనాలి ఖాతూన్, ఆమె 8 ఏళ్ల బిడ్డను తిరిగి తీసుకురావాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఈ కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చి మాట్లాడుతూ.. కొన్నిసార్లు చట్టం మానవత్వం ముందు తలవంచాల్సి వస్తుందని అన్నారు. మానవతా దృక్పథంతో సోనాలి ఖాతూన్, ఆమె బిడ్డను భారతదేశానికి తీసుకువ‌స్తున్నాం. ఎలాంటి లాజిక్‌ను ప్రభావితం చేయకుండా ఈ చర్య తీసుకుంటాం. ఇది ఇతర విషయాలపై ప్రభావం చూపదని, ఇది కేవలం మానవతా ప్రాతిపదికన తీసుకున్న చర్య అని స్పష్టం చేసింది.

మానవతా దృక్పథంతో గర్భిణీ స్త్రీ, ఆమె ఎనిమిదేళ్ల చిన్నారిని భారత్‌లోకి ప్రవేశించేందుకు సుప్రీంకోర్టు బుధవారం అనుమతించింది. అలాగే మైనర్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. గర్భిణీ స్త్రీ సోనాలి ఖాటూన్‌కు సాధ్యమైన అన్ని ర‌కాల‌ వైద్య సహాయం అందించాలని బీర్భూమ్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ను ఆదేశించారు.

విచారణ సందర్భంగా.. కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. మానవతా దృక్పథంతో ఆ మహిళను, ఆమె బిడ్డను దేశంలోకి అనుమతించడానికి కోర్టు అంగీకరించింది.. అయితే వారిని పరిశీలనలో ఉంచుతామని, చివరికి వారిని ఢిల్లీకి తిరిగి తీసుకువస్తామని, అక్కడి నుండి బంగ్లాదేశ్‌కు పంపుతామ‌ని తుషార్ మెహతా పేర్కొన్నారు.

సోనాలి భర్తతో సహా మరికొంత మంది బంగ్లాదేశ్‌లో ఉన్నారని, వారిని భారత్‌కు తీసుకురావాల్సిన అవసరం ఉందని, దీని కోసం మెహతా తదుపరి సూచనలు తీసుకోవచ్చని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, సంజయ్ హెగ్డే కోర్టుకు తెలిపారు. భారతీయ పౌరులమని వారి వాదనను తాను వ్యతిరేకిస్తానని, వారు బంగ్లాదేశ్ పౌరులని, మానవతా దృక్పథంతో మాత్రమే కేంద్ర ప్రభుత్వం మహిళ, ఆమె బిడ్డను భారతదేశంలోకి అనుమతించిందని మెహతా అన్నారు.

Next Story