బిడెన్‌కు కోవిడ్‌ నెగిటివ్‌.. భారత్‌ టూర్‌పై క్లారిటీ

యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బిడెన్ మంగళవారం మళ్లీ కోవిడ్-19 పరీక్షలో నెగెటివ్ అని వైట్ హౌస్ తెలిపింది.

By అంజి  Published on  6 Sep 2023 3:22 AM GMT
Biden, Covid test, India, White House, international news

బిడెన్‌కు కోవిడ్‌ నెగిటివ్‌.. భారత్‌ టూర్‌పై క్లారిటీ

యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బిడెన్ మంగళవారం మళ్లీ కోవిడ్-19 పరీక్షలో నెగెటివ్ అని వైట్ హౌస్ తెలిపింది. షెడ్యూల్‌ ప్రకారమే.. భారత్‌లో జరిగే జీ-20 సమావేశాల్లో జో బిడెన్‌ పాల్గొంటారని స్పష్టం చేసింది. గురువారం నాడు బిడెన్‌ భారత్‌కు రానున్నారు. అంతకుముందు అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బిడెన్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో జో బిడెన్‌ టూర్‌ ఉత్కంఠ నెలకొంది. తాజాగా బిడెన్‌ భారత్‌ టూర్‌పై వైట్‌హౌస్‌ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె డెలావెర్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు వైట్‌హౌస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. నిన్న, మొన్న చేసిన కోవిడ్‌ టెస్ట్‌ల్లో జో బిడెన్‌కి నెగిటివ్‌ వచ్చిందని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవాన్‌ తెలిపారు.

గురువారం ఢిల్లీ బయల్దేరనున్న అమెరికా అధ్యక్షుడు.. శుక్రవారం నాడు ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారని తెలిపారు. కోవిడ్‌ -19 గైడ్‌లైన్స్‌ని పాటిస్తూ.. జో బిడెన్‌ ఈ మీటింగ్‌కు హాజరవుతారని వైట్‌హౌస్‌ తెలిపింది. సెప్టెంబర్‌ 9, 10వ తేదీల్లో జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశాల్లో బిడెన్‌ పాల్గొననున్నారు. డెవలప్‌ అవుతున్న దేశాలతో కలిసి పని చేయడానికి అమెరికా కట్టుబడి ఉందని వైట్‌హౌస్‌ పేర్కొంది. జీ20 సమావేశాల తర్వాత బిడెన్‌ వియత్నాం టూర్‌కు వెళ్లనున్నారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో జరిగే జీ 20 శిఖరాగ్ర సమావేశాలకు.. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. అధికారులు ఢిల్లీలో హైఅలర్ట్‌ ప్రకటించారు.

Next Story