రష్యాలోని పశ్చిమ బ్రయాన్స్క్ ప్రాంతంలో శనివారం రాత్రి వంతెన కూలిపోవడంతో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఏడుగురు మరణించగా, 30 మంది గాయపడ్డారని రీజినల్ గవర్నర్ అలెగ్జాండర్ బోగోమాజ్ను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. ఈ రైలు మాస్కో నుండి క్లిమోవ్కు వెళుతుండగా వైగోనిచ్స్కీ జిల్లాలో పట్టాలు తప్పింది.
"రవాణా కార్యకలాపాలలో అక్రమ జోక్యం" వల్లే ఈ వంతెన కూలిపోయిందని అధికారులు తెలిపారు, కానీ మరిన్ని వివరాలను అందించలేదు. ప్రాంతీయ గవర్నర్ అలెగ్జాండర్ బొగోమాజ్ టెలిగ్రామ్లో ఈ సంఘటనను ధృవీకరించారు, అత్యవసర సేవలు సంఘటన స్థలంలో ఉన్నాయని చెప్పారు. ఫెడరల్ హైవే సమీపంలో పట్టాలు తప్పిన ప్రమాదం జరిగిందని, బహుళ రెస్క్యూ యూనిట్లను మోహరించామని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది.
రష్యా రాష్ట్ర వార్తా సంస్థలు RIA, TASS.. రైలు డ్రైవర్ మృతుల్లో ఉన్నారని రిపోర్ట్ చేశాయి. మరికొన్ని వార్త సంస్థలు.. వంతెనను ఉద్దేశపూర్వకంగా పేల్చివేసి ఉండవచ్చని పేర్కొన్నాయి, అయితే ఈ నివేదికలు స్వతంత్రంగా ధృవీకరించబడలేదు. ఉక్రేనియన్ అధికారుల నుండి తక్షణ వ్యాఖ్య రాలేదు. ప్రభుత్వ సంస్థలు సంఘటనా స్థలం నుండి షేర్ చేసిన ఫోటోలు కూలిపోయిన వంతెన నుండి కాంక్రీట్ ముక్కల మధ్య ప్యాసింజర్ రైలు బోగీలు విడిపోయి చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు చూపించాయి.