బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు.. 8 మంది మృతి, 26 మందికి గాయాలు

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రాంతంలో శనివారం ప్రయాణికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎనిమిది మంది మృతి చెందగా, 26 మంది గాయపడ్డారు.

By అంజి  Published on  3 Dec 2023 2:48 AM GMT
terrorists , POK, Gilgit, Baltistan, Crime news

బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు.. 8 మంది మృతి, 26 మందికి గాయాలు

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రాంతంలో శనివారం ప్రయాణికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎనిమిది మంది మృతి చెందగా, 26 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. బస్సు గిల్గిట్ నుండి రావల్పిండికి వెళుతుండగా చిలాస్‌లో సాయంత్రం 6:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని అధికారి తెలిపారు. దాడి తర్వాత డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టిందని అధికారి తెలిపారు.

ఈ దాడిలో మరణించిన ఎనిమిది మందిలో ఐదుగురిని ఇప్పటివరకు గుర్తించినట్లు డిప్యూటీ కమిషనర్ చిలాస్ ఆరిఫ్ అహ్మద్ తెలిపారు. మరో 26 మంది గాయపడ్డారని, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. మృతుల్లో బస్సులో ఉన్న ఇద్దరు ఆర్మీ సైనికులు కూడా ఉన్నారని, ఈ దాడిలో స్పెషల్ ప్రొటెక్షన్ యూనిట్‌లోని ఒక సిబ్బంది గాయపడ్డారని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఎక్కువ మంది కోహిస్థాన్, పెషావర్, ఘిజర్, చిలాస్, రౌండు, స్కర్డు, మన్సెహ్రా, స్వాబి ప్రాంతాలకు చెందిన వారని, సింధ్‌కు చెందిన ఒకరిద్దరు ఉన్నారని తెలిపారు.

దాడి అనంతరం ఉగ్రవాదులు ఘటనా స్థలం నుంచి తప్పించుకోగలిగారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ దాడిపై దర్యాప్తు ప్రారంభించామని, ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడికి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించలేదు, అయితే ఈ ప్రాంతానికి తీవ్రవాద దాడుల చరిత్ర ఉంది. 2013లో గిల్గిత్ బాల్టిస్తాన్‌లోని పర్వతారోహకుల క్యాంపింగ్ సైట్‌పై ముష్కరులు చొరబడి తొమ్మిది మంది విదేశీయులను హతమార్చారు.

Next Story