62 Inmates Dead In Ecuador Prison Riots. . ఈక్వెడార్ దేశపు పశ్చిమ ఓడరేవు నగరమైన గుయాక్విల్ జైలులో జరిగిన ముఠా అల్లర్లలో 62 మంది ఖైదీలు మరణించారు.
By Medi Samrat Published on 24 Feb 2021 3:39 AM GMT
గుయాక్విల్ జైలులో విషాదం చోటుచేసుకుంది. ఈక్వెడార్ దేశపు పశ్చిమ ఓడరేవు నగరమైన గుయాక్విల్ జైలులో జరిగిన ముఠా అల్లర్లలో 62 మంది ఖైదీలు మరణించారు. ఈ ఘటనలో పలువురు ఖైదీలు గాయపడ్డారు. ఈ విషయమై జైళ్ల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ఎడ్ముండో మోన్కాయో స్నందిస్తూ.. దక్షిణ క్యుంకాలోని జైలులో 33 మంది, లాటాకుంగాలో 8 మంది మరణించినట్లు తెలిపారు. అల్లర్లలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారని.. ఖైదీల నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
అయితే.. ఈక్వెడార్ జైళ్లలో ఖైదీల మధ్య ఘర్షణ చెలరేగడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది కూడా జైళ్లలో 51 మంది ఖైదీలు మరణించారు. 29వేలమంది ఖైదీల సామర్థ్యం గల జైళ్లలో 38వేలమంది ఖైదీలను ఉంచారు. ఆ ఖైదీలను పర్యవేక్షించడానికి కేవలం 1500 మంది కాపలాదారులు మాత్రమే ఉన్నారు. దీంతో ఈక్వెడార్ జైళ్లలో పలుసార్లు ఖైదీల తిరుగుబాటు జరుగుతోంది.
ఈ విషయమై ఈక్వెడార్ అధ్యక్షుడు లెనిన్ మోరెనో.. జైళ్లలో ఏకకాలంలో హింసాకాండ చెలరేగడానికి నేరగాళ్లే కారణమని ట్వీట్ చేశారు. ఓ ఖైదీ భార్య మాట్లాడుతూ.. ఘటనకు ముందు.. వారు నన్ను చంపబోతున్నారు, నన్ను ఇక్కడి నుంచి బయటకు రప్పించండి అని తన భర్త అయిన ఖైదీ రికార్డో నుంచి వాట్సాప్ వాయిస్ మెసేజ్ వచ్చిందని తెలిపింది.