విశాఖ తీరంలో భారత్, అమెరికా సైనిక విన్యాసాలు..!
By న్యూస్మీటర్ తెలుగు Published on 10 Nov 2019 11:17 AM ISTముఖ్యాంశాలు
- 'టైగర్ ట్రయాంఫ్' పేరుతో సైనిక విన్యాసాలు
- 8 రోజుల పాటు జరగనున్న సైనిక విన్యాసాలు
ఆంధ్రప్రదశ్ సాగర తీరాన భారత్, అమెరికా సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. భారత్, అమెరికా త్రివిధ దళాలు ‘టైగర్ ట్రయాంఫ్’ (పులి విజయం) పేరుతో ఆంధ్రప్రదేశ్లోని విశాఖ, కాకినాడ సముద్రతీరంలో సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి.
ఈ నెల 13 నుంచి 8 రోజుల పాటు జరిగే ఈ విన్యాసాల్లో 500 మంది అమెరికన్ మెరైన్స్, సెయిలర్స్, ఎయిర్మెన్, భారత దేశపు త్రివిధ దళాలకు చెందిన 1,200 మంది పాల్గొననున్నారు. భారత్కు చెందిన ఐఎన్ఎస్ జలష్వా, ఐఎన్ఎస్ ఐరావత్తో పాటు అమెరికాకు చెందిన యూఎస్ఎస్ జర్మన్ టౌన్ యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో ఆకర్షణగా నిలవనున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా సవాల్ విసురుతున్న టెర్రరిజాన్ని అణిచివేసేందుకు భారత్, అమెరికా ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్, అమెరికాలు ఆయుధ సంపత్తితో తమ సత్తాను ప్రదర్శించబోతున్నాయి. భారత్, అమెరికా మధ్య సత్సంబంధాలు మెరుగుపడనున్నాయి. భద్రత, పరస్పర సహకారం, విపత్తుల వేళ పరస్పర తోడ్పాటు వంటి అంశాలను బలోపేతం చేసుకోవడమే ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం.