Fact Check : భారత వైమానిక దళానికి చెందిన విమానాన్ని నేపాల్ సైన్యం కూల్చివేసిందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 July 2020 7:57 AM GMT
Fact Check : భారత వైమానిక దళానికి చెందిన విమానాన్ని నేపాల్ సైన్యం కూల్చివేసిందా..?

నేపాల్ సైన్యం ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐ.ఏ.ఎఫ్.)కు చెందిన విమానాన్ని కూల్చివేసిందని సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు వైరల్ అవుతోంది.

"భారత వైమానిక దళానికి చెందిన విమానం బోర్డర్ ను దాటింది. నేపాల్ భూభాగాలపై దాడి చేయాలని భావించింది. భారత్-నేపాల్ సరిహద్దుల్లో కోట్ ఖరక్ సింగ్ పేర్నవాన్ ప్రాంతంలో భారత వైమానికదళం దాడి చేసింది. వెంటనే స్పందించిన నేపాల్ సైన్యం తిరిగి దాడి చేయగా ఒక జెట్ విమానాన్ని కూల్చివేసింది. ఇద్దరు పైలట్లు కూడా మరణించారు.' అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు.

“Indian air force had crossed the border to conduct an airstrike on the Nepal territories today. India conducted an airstrike in Kot Kharak Singh Pernawan near the India Nepal border. In response, we’ve shot down Indian jet & two Indian pilots killed,” అన్న ట్వీట్ ను వైరల్ చేస్తున్నారు.



ఫేస్ బుక్ లో కూడా పలువురు దీన్ని షేర్ చేశారు.

N1

నిజ నిర్ధారణ:

భారత వైమానిక దళానికి చెందిన విమానాన్ని నేపాల్ సైన్యం కూల్చివేసిందన్నది 'పచ్చి అబద్ధం'. ఇటీవలి కాలంలో సరిహద్దు ఉల్లంఘన వంటి ఘటనలు జరగడం లేదు.

ఈ వైరల్ పోస్టులో ఉన్న విమానం కూలిపోతున్న ఫోటో గురించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ వైరల్ పోస్టు లిబియాకు చెందినది. 2011కు చెందిన ఫోటో. The Columbia వార్తా సంస్థ కథనం ప్రకారం ఈ యుద్ధ విమానం లిబియా లోని బెంఘాజి ప్రాంతంలో కూలిపోయింది. మార్చి 19, 2011న ఈ ఘటన చోటుచేసుకుంది.

N2

‘Libyan airplane Shot' అన్న కీవర్డ్స్ ను ఉపయోగించగా.. The Aviationist అనే వెబ్సైట్ లో విమానం కూలిపోయిన ఘటనకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ఈ యుద్ధ విమానం మొదట గడ్డాఫీకి చెందిన మిగ్-23 విమానమని భావించారు.. కానీ అది ఫ్రీ లిబియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం అని తెలిసింది. మార్చి 19, 2011న ఈ ఘటన చోటుచేసుంది.

రెండో ఫోటో బెంగళూరు HAL ఎయిర్ పోర్ట్ కు చెందినది. భారత ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఫైటర్ జెట్ బెంగళూరులో శుక్రవారం ఉదయం కూలిపోయింది. దసాల్ట్ మిరాజ్ 2000 విమానం కూలిపోయింది. విమానం నుండి పైలట్లు బయటకు వచ్చేసారు.. కానీ చనిపోయినట్లు తెలుస్తోంది. ఉదయం 10:30 సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని.. విమానంలో చోటుచేసుకున్న లోపాల కారణంగా ఈ ప్రమాదం జరిగింది. International Business Times లో ఆర్టికల్ ను చూడొచ్చు.

N3

సరిహద్దు ఉల్లంఘన ఘటనలు చోటుచేసుకోలేదని, ఇద్దరు పైలట్లు మరణించారంటూ భారత వైమానిక దళం ఎటువంటి విషయాన్ని కూడా వెల్లడించలేదు.

భారత వైమానిక దళానికి చెందిన విమానాన్ని ఇటీవల నేపాల్ సైన్యం కూల్చివేసిందన్న పోస్టు 'అబద్ధం'.

Next Story