భారత్‌లో విజృంభిస్తున్న కరోనా.. 24గంటల్లో 18,552కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jun 2020 5:07 AM GMT
భారత్‌లో విజృంభిస్తున్న కరోనా.. 24గంటల్లో 18,552కేసులు

దేశంలో లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత కరోనా మహమ్మారి భారత్‌లో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతి రోజు రికార్డు సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 5లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 18,552 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 384 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర, వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా వ్యాప్తి దేశంలో మొదలైన తరువాత ఒక్క రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే.

వీటితో కలిపి ఇప్పటి వరకు 5,08,953పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసుల్లో 2,95,881 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 1,97,387 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి భారీన పడి ఇప్పటి వరకు 15,685 మంది ప్రాణాలు కోల్పోయారు. జూన్‌ 26 వరకు దేశంలో మొత్తం 79,96,707 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,20,479 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ 4వ స్థానంలో ఉంది.

Next Story