భారత్లో రికార్డు స్థాయిలో కరోనా.. 24గంటల్లో 5,242 కేసులు, 157 మంది మృతి
By తోట వంశీ కుమార్ Published on 18 May 2020 5:16 AM GMTభారత్లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5242 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 157 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. ఒకే రోజు ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వీటితో కలిసి ఇప్పటి వరకు దేశంలో 96,169 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి భారీన పడి 3,029 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో 36,824 మంది డిశ్చార్జి కాగా.. 56,316 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. గడిచిన 24 గంట్లలో 2437 కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 33,053 కరోనా కేసులు నమోదు కాగా.. 1198 మంది మృత్యువాత పడ్డారు. తమిళనాడులో 11,224 కేసులు నమోదు కాగా.. 78 మంది మరణించారు. ఢిల్లిలో 10,054 కేసులు నమోదు కాగా.. 160 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్లో 11,379 కేసులు నమోదు కాగా.. 659 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్లో 4,977 కేసులు నమోదు కాగా 238 మంది మరణించారు. రాజస్థాన్ లో 5,202 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 131 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో 2,407 కేసులు నమోదు కాగా 50 మంది మృత్యువాతపడ్డారు. తెలంగాణలో 1,551 కేసులు నమోదు కాగా.. 34 మంది మరణించారు.
ఇక దేశంలో నేటి నుంచి లాక్డౌన్ 4.0 అమలులోకి వచ్చింది. ఈ నెల 31 వరకు దేశవ్యాప్త లాక్డౌన్ను పొడిగించడగా.. పలు సడలింపులు ఇచ్చారు. సడలింపులతో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంది.