భారత్లో 24 గంటల్లో 2664 కేసులు.. 83 మంది మృతి
By తోట వంశీ కుమార్ Published on 3 May 2020 6:04 AM GMTభారత్లో కరోనా మహమ్మారి విజృభిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో అత్యధిక మరణాలు నమోదైయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో 2,644 కేసులు నమోదు కాగా.. 83 మంది మృత్యువాత పడ్డారు. కొత్త వాటితో కలిపి ఇప్పటి వరకు 39,980 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి బారీన పడి 1301 మంది మరణించారు. మొత్తం నమోదైన కేసుల్లో 10,633 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 28,046 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 12,296 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 521 మంది మృతి చెందారు. గుజరాత్లో 5,054 కేసులు నమోదు కాగా.. 262 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో 4,122 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 64 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్లో 2,846 కేసులు నమోదు కాగా, 151 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 2,757 మందికి కరోనా సోకగా.. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్లో 2,770 కేసులు నమోదు కాగా.. 65 మంది మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్లో 2,487 కేసులు నమోదు కాగా.. 43 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఏపీలో నిన్న ఒక్క రోజే 62 పాజిటివ్ కేసులు నిర్థారణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 1525కి చేరింది. ఇప్పటి వరకు 33 మంది మరణించారు. తెలంగాణలో నిన్న కొత్తగా 17 కేసులు నమోదు అయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1061కి చేరగా.. 29 మంది మృత్యువాత పడ్డారు.