భారత్లో రికార్డు స్థాయిలో కేసులు.. 24గంటల్లో 12,881కేసులు
By తోట వంశీ కుమార్ Published on 18 Jun 2020 10:10 AM IST
భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. లాక్డౌన్ సడలింపులు తరువాత దేశంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 12,881 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ కాగా.. 334 మంది మరణించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటికి ఒక్క రోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో 3,66,946 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 12,227 మంది ప్రాణాలు కోల్పోయారు.
మొత్తం నమోదైన కేసుల్లో 1,94,325 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 1,60,384 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. ఇక మరణాలు అత్యధికంగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్ ఎనిమిదవ స్థానానికి చేరుకుంది. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండడం కాస్త ఊరటనిస్తుంది. ఇక రికవరీ రేటు 52.5శాతంగా ఉండగా.. మరణాల రేటు 3.3శాతంగా ఉంది.