భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24గంటల్లో 11,929కేసులు.. 310 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jun 2020 4:07 AM GMT
భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24గంటల్లో 11,929కేసులు.. 310 మంది మృతి

కరోనా మహమ్మారి భారత్‌లో మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన వారం రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 11929 కేసులు నమోదు కాగా.. 310 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఒక్క రోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసులు ఇవే. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో 3,21,626 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 9,195 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదైన కేసుల్లో 1,62,379 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 1,50,048 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కేసుల సంఖ్య 3 లక్షలు దాటిన రెండు రోజుల్లోనే 3.21 లక్షలకు పైగా చేరుకోవడం దేశంలో కరోనా మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది. లాక్‌డౌన్‌లో భారీ సడలింపులు ఇవ్వడంతో కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 78 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 4లక్షలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన దేశాల్లో భారత్‌ 4వ స్థానానికి చేరింది. మొదటి స్థానంలో 21లక్షల కేసులతో అమెరికా ఉండగా.. ఆ తర్వాత బ్రెజిల్‌ (8లక్షలు), రష్యా (5లక్షలు) లు ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే.. త్వరలోనే ఇండియా మొదటి స్థానానికి చేరుకుంటుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story