అమిత్ షా ప‌ర్య‌ట‌న‌.. 'వాషింగ్ పౌడర్ నిర్మా' హోర్డింగుల కలకలం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న వేళ వాషింగ్ పౌడర్ నిర్మా పేరుతో హోర్డింగ్‌లు క‌ల‌క‌లం రేపాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 March 2023 12:37 PM IST
Washing Powder Nirma hoardings, Amit Shah Tour

వాషింగ్ పౌడర్ నిర్మా పేరుతో వెలిసిన హోర్డింగులు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న వేళ హోర్డింగ్‌లు క‌ల‌క‌లం రేపాయి.హోర్డింగ్స్‌లో వాషింగ్ పౌడ‌ర్ నిర్మా పేరుతో వెల్‌క‌మ్ టూ అమిత్ షా అంటూ రాసుకొచ్చారు. అలాగే హిమంత బిశ్వశర్మ, నారాయణ్‌ రాణె, సువేందు అధికారి, సుజనాచౌదరి, జ్యోతిరాదిత్య సింధియా సహా పలువురు బీజేపీ నేతల ఫొటోలతో పోస్టర్లు పెట్టారు. బీజేపీలో చేరితే మ‌ర‌క‌లు పోతాయ‌ని అర్థం వ‌చ్చేలా హోర్డింగ్స్ ఉన్నాయి. వీటిని ఎవ‌రు ఏర్పాటు చేశారు అన్న‌ది తెలియ‌రాలేదు.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లోని హకీంపేటలోగల నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్‌ఐఎస్‌ఏ)లో ఆదివారం జరిగిన 54వ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) రైజింగ్ డే పరేడ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అమరులకు నివాళులర్పించిన అమిత్‌ షా.. సీఐఎస్‌ఎఫ్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సంద‌ర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. 53 ఏండ్లుగా దేశ సేవలో సీఐఎస్‌ఎఫ్‌ కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. దేశాన్ని రక్షించడంలో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది సాధించిన విజయాలకు భారతదేశం గర్విస్తుందన్నారు. విధుల్లో భాగంగా చాలా మంది సిబ్బంది తమ ప్రాణాలను అర్పించారన్నారు. సీఐఎస్‌ఎఫ్‌కి అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన్ని సమకూర్చడంలో అన్నిరకాలుగా సహకారం అందిస్తామన్నారు. డ్రోన్‌ టెక్నాలజీని మరింత బలోపేతం చేయ‌నున్న‌ట్లు చెప్పారు.

Next Story