స‌రికొత్త టెక్నాలజీతో ఎల‌క్ట్రిక్ సైకిళ్లు వ‌చ్చేస్తున్నాయ్‌.. హైద్రాబాదీ కుర్రాళ్ల సృష్టి..!

Two youngsters launch unique electronic smart cycle. బ్యాటరీ సైకిళ్ళదే రాబోయే రోజుల్లో మార్కెట్ అని ఎంతో మంది నిపుణులు చెబుతూ ఉన్నారు.

By Medi Samrat  Published on  10 Dec 2021 5:12 AM GMT
స‌రికొత్త టెక్నాలజీతో ఎల‌క్ట్రిక్ సైకిళ్లు వ‌చ్చేస్తున్నాయ్‌.. హైద్రాబాదీ కుర్రాళ్ల సృష్టి..!

బ్యాటరీ సైకిళ్ళదే రాబోయే రోజుల్లో మార్కెట్ అని ఎంతో మంది నిపుణులు చెబుతూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే యువత కూడా కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందుకు వస్తోంది. ఇద్దరు హైదరాబాదీ యువకులు `ఎర్మిన్ ఆటోమోటివ్' అడాప్టివ్ యూజర్ టెక్నాలజీతో కూడిన ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ సైకిల్‌ను మార్కెట్ లోకి తీసుకుని వచ్చారు. 'ఎర్మిన్ మైల్స్' అని పిలువబడే ఈ ఎలక్ట్రానిక్ స్మార్ట్ సైకిల్ దాన్ని నడిపే వారి ప్రవర్తన, రహదారి పరిస్థితులు, డ్రైవర్ ఉపయోగించే రోడ్లు వంటి ఎన్నో వాటిపై ఓ అంచనాకు రానుంది. హైదరాబాద్‌ వేదికగా ఈ కొత్త తరం సైకిల్ అందుబాటులోకి వచ్చింది. ఐసీఎఫ్‌ఏఐ యూనివర్సిటీ విద్యార్థులు ఎర్మిన్‌ ఆటోమోటివ్‌ స్టార్టప్‌తో ఈ సైకిల్‌ను పూర్తి ఎలక్ట్రానిక్‌ సిస్టంతో మార్కెట్ లోకి తీసుకుని వచ్చారు. ఖైరతాబాద్‌లోని బిర్లా సైన్స్‌ మ్యూజియం భాస్కర్‌ ఆడిటోరియంలో గురువారం ఐటీ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఈ స్మార్ట్‌ సైకిల్‌ను ఆవిష్కరించారు.

ఈ సైకిల్ లోని అదిరిపోయే ఫీచర్ ఏమిటంటే.. స్మార్ట్ సైకిల్ తొక్కే వ్యక్తి యొక్క పెడలింగ్ వేగాన్ని గుర్తించగలదు. సైకిల్ తొక్కే వ్యక్తి నెమ్మదించిన సందర్భంలో, బ్యాటరీ వేగాన్ని పుంజుకుంటుంది. బైక్ ఏ మాత్రం స్పీడ్ తగ్గకుండా ముందుకు కొనసాగుతుంది. ఏటవాలుగా ఉన్న ప్రాంతంలో ఈ స్మార్ట్ సైకిల్ బాగా ఉపయోగపడుతుంది. హ్యాండిల్స్‌లో హృదయ స్పందన సెన్సార్ కూడా ఉంటుంది. హృదయ స్పందన నిర్దిష్ట సంఖ్యకు చేరుకున్నట్లయితే, సెన్సార్‌లు అలర్ట్ చేస్తాయి. చక్రం బ్యాటరీ మోడ్‌లో పనిచేయడం ప్రారంభిస్తుంది.

ఇ-సైకిల్ 'ఎర్మిన్ కేర్' స్మార్ట్‌ఫోన్ యాప్‌తో వస్తుంది, ఇది కొనుగోలు నుండి పునఃవిక్రయం, రిమోట్ డయాగ్నసిస్, రిపేర్ మొదలైన అన్ని సేవలను అందిస్తుంది. ICFAI విశ్వవిద్యాలయంలో చదువుకున్న శశాంక్ ఫౌండర్, సీఈఓగా ఉన్నాడు. సహ వ్యవస్థాపకుడు, COO & ప్రోడక్ట్ డైరెక్టర్ అయిన ఆదిత్య ICFAI విశ్వవిద్యాలయంలో BBA చదువుకున్నాడు. బిఎమ్ బిర్లా ప్లానిటోరియంలోని భాస్కర్ ఆడిటోరియంలో తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ వారి కలల వాహనాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్‌ రంగానికి తెలంగాణ రాష్ట్రం పూర్తి అనుకూలంగా ఉందని అన్నారు. ఈవీ అంటే కేవలం ప్యాసింజర్‌ వెహికిల్స్‌ మాత్రమే కాదని, వస్తు రవాణా వాహనాల్లో కూడా ఈవీ వాహనాలు వస్తున్నాయని చెప్పారు. నేను గతంలో ఐసీఎఫ్‌ఏఐ యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడానని గుర్తు చేశారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు చాలా మంది ఉన్నారని... వారికి సరిపడా ఉద్యోగాలు లేవు. కానీ ప్రతీ విద్యార్థి తమ నూతన ఆలోచనలతో ఇతరులకు ఉపాధి సృష్టించే ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందని విద్యార్థులతో చెప్పినట్టు తెలిపారు. అదే స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజు విద్యార్థులు సరికొత్త స్మార్ట్‌ సైకిల్‌ను అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయమని అన్నారు. ఎలక్ట్రానిక్‌ వాహనాల తయారీకి తెలంగాణ డెస్టినేషన్‌గా ఉందని చెప్పారు. టెస్లా తన ప్లాంట్‌ను జహీరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి సుముఖంగా ఉన్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ స్టార్టప్‌లను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను సృష్టించగలగాలని వివరించారు. ఇప్పటికే ఐకియా లాంటి కంపెనీలు తమ ప్రొడక్టులను కస్టమర్లకు ఈవీ వాహనాల్లోనే తరలిస్తున్నాయని చెప్పారు.

ఎర్మిన్ ఆటోమోటివ్ రెండు పేటెంట్లను కలిగి ఉంది, ఇందులో సైకిల్ రూపకల్పన మరియు బ్యాటరీ పరిధిని 75 శాతం పెంచే కొత్త రీజెనరేషన్ మాడ్యూల్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మూడు విభిన్న శ్రేణుల సైకిళ్లను ఆవిష్కరించారు. వీటి ధర రూ.60,000 నుంచి 75,000 వరకు ఉంటుంది. కొనుగోలు చేయాలనుకునే వారు కంపెనీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. బుకింగ్ డిసెంబర్ 10 నుండి ప్రారంభమవుతుంది. వాహనాలు మార్చి 2022 నుండి డెలివరీ చేయబడతాయి.


Next Story