Hyderabad: నాంపల్లిలో పట్టాలు తప్పిన రైలు.. పలువురికి గాయాలు

హైదరాబాద్‌ నగరంలోని నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది.

By అంజి  Published on  10 Jan 2024 5:34 AM GMT
Train accident, Hyderabad, Charminar Express derailed, Nampally

Hyderabad: నాంపల్లిలో పట్టాలు తప్పిన రైలు.. పలువురికి గాయాలు

హైదరాబాద్‌ నగరంలోని నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. 5వ నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి చేరుకునే క్రమంలో రైలు.. సైడ్‌ వాల్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా రైలు పట్టాలు తప్పి కుదుపులకు లోనైంది. ఎస్‌ 2, ఎస్‌ 3, ఎస్‌ 6 బోగీలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను లాలాగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు. రైలు చెన్నై నుంచి నాంపల్లి చేరుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది.

లోకో పైలట్‌ తప్పిదమే దీనికి కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. స్టేషన్‌కు చేరుకునేందుకు రైలు నెమ్మదిగా కదలడంతో పెను ప్రమాదం తప్పింది. నాంపల్లి రైల్వేస్టేషన్‌లో జరిగిన ప్రమాదంపై హైదరాబాద్‌ ఇన్‌ఛార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విచారం వ్యక్తం చేశారు. పెను ప్రమాదం తప్పిందని.. అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని సూచించారు.

డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడం వల్ల ట్రైన్ పట్టాలు తప్పిందని రైల్వే అధికారులు వెల్లడించారు. ట్రైన్ లోకో పైలట్ డెడ్ లైన్ వాల్ ను ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని సిపిఆర్వో రాకేష్ వెల్లడించారు. రైల్వే సిబ్బంది ఇప్పటికే సహాయం చర్యలు చేపట్టారు పట్టాలు తప్పిన మూడు భోగిలను పట్టాలపై సరిచేసి యధావిధిగా ట్రైను వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సి పి ఆర్వో రాకేష్ తెలిపారు. ఇప్పటికే పోలీసులు, రైల్వే అధికారులు రంగంలోకి దిగి రైలు ప్రమాదం పై ఆరాతీస్తున్నారు.

Next Story