ఓయూలో ఉద్రిక్తత.. ఆ ఇద్దరి నేతల రాకను వ్యతిరేకిస్తూ..
Tension prevails in Osmania University as students burns TRS flexes. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోకి ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్
By Medi Samrat Published on 28 Jan 2022 8:24 AM GMT
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోకి ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రవేశించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు టీఆర్ఎస్ ఫ్లెక్సీలను దగ్ధం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించారు. క్యాంపస్ను సందర్శించిన టీఆర్ఎస్ పార్టీ నేతలను నిరసిస్తూ విద్యార్థులు నేతల ఫ్లెక్సీలను చించివేసి దగ్ధం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడం, యూనివర్సిటీకి సంబంధించిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో టీఆర్ఎస్ పార్టీకి క్యాంపస్లోకి ప్రవేశించే హక్కు లేదని విద్యార్థులు ఆరోపించారు.
నిరసన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నేత సురేష్ యాదవ్ ఆర్ట్స్ కాలేజీ ఎదుట పెట్రోల్ బాటిల్తో నిరసనకు దిగారు. ఒంటి మీద పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడేంత వరకు టీఆర్ఎస్ నేతలు క్యాంపస్లోకి రావద్దని జేఏసీ నేత అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులకు పార్టీ క్షమాపణలు చెప్పాలని ఆయన అన్నారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.