హైదరాబాద్: సమాజంలో వేగంగా పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన తదితర మానసిక సమస్యలకు పరిష్కారం చూపించగల సామర్థ్యం టెక్నాలజీకి ఉందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. "సైబర్ హోప్ హెల్ప్ ఇనిషియేటివ్ ఫౌండేషన్" ఆధ్వర్యంలో రూపొందించిన ఏఐ ఆధారిత మెంటల్ హెల్త్ సపోర్ట్ సిస్టం 'హోప్ ఐ' ను రాయదుర్గం లోని టీ హబ్ లో లాంఛనంగా ఆవిష్కరించారు. ఇన్నోవేషన్ హబ్ గా తెలంగాణ తీర్చి దిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఈ సందర్భంగా వివరించారు. ప్రజల ప్రాణాలను కాపాడే ఆవిష్కరణలకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఆ దిశగా దృష్టి సారించి ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవాలని యువ ఆవిష్కర్తలకు సూచించారు.