Secunderabad Railway station: రేపు 10వ నంబర్ ప్లాట్ఫారమ్ మూసివేత
ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ నుండి తిరుపతికి వందేభారత్
By అంజి Published on 7 April 2023 12:30 PM IST
Secunderabad Railway station: రేపు 10వ నంబర్ ప్లాట్ఫారమ్ మూసివేత
ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ నుండి తిరుపతికి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును శనివారం ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 10వ నెంబర్ ప్లాట్ఫారమ్ను ప్రయాణికుల కోసం మూసివేయనున్నారు. ప్రయాణికుల రాకపోకలు, టిక్కెట్ బుకింగ్, క్యాటరింగ్ స్టాల్స్, వెయిటింగ్ వంటి సౌకర్యాల ఉండకుండా ప్లాట్ఫారమ్ నంబర్ 10 మూసివేయబడుతుంది. ప్రయాణికులు వేచి ఉండే హాళ్లు కూడా మూసివేయబడతాయి.
శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం మధ్యాహ్నం 1 గంట వరకు ఆంక్షలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్ స్థలం కూడా ఆ సమయంలో మూసివేయబడుతుంది. రైల్వే అధికారులు.. పౌరులు మార్పును గమనించి, తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అభ్యర్థించారు.
ఉదయం 11 గంటల 45 నిమిషాల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు ప్రధాని చేరుకుని వందే భారత్ రైలును ప్రారంభిస్తారు. అనంతరం.. పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అదేవిధంగా బీబీనగర్లో నిర్మించనున్న ఎయిమ్స్కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం.. ఐదు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కూడా ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు.