వర్షాకాలం అంటే చాలు..డెంగ్యూ, జలుబు, ఫ్లూ, టైఫాయిడ్, చికెన్ గున్యా, కలరా, డయేరియా మొదలగు వ్యాధులు ఈ సీజన్లోనే అత్యధికంగా ఉంటాయి.ఈ సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండాలంటే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మరో వైపు ఇప్పుడిప్పుడే కరోనా నుండి కోలుకుంటున్న హైదరాబాద్ వాసులలో సీజనల్ వ్యాధుల టెన్షన్ మొదలైంది. గత 15 రోజుల నుంచి హైదరాబాద్ లో సీజనల్ వ్యాధులు పెరగడంతో భారీ సంఖ్యలో నగరవాసులు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. వారిలో ఎక్కువగా డెంగీ అనుమానితులు ఉన్నారు.
హైదరాబాద్ లో డెంగీ కేసులు నమోదవుతూ ఉండడంతో వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజలు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నగరంలో 65 డెంగీ అనుమానిత కేసులు నమోదయ్యాయని.. వాటిల్లో తొమ్మిదిమందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులు మరింత విస్తరించకముందే జీహెచ్ఎంసీ అధికారులు వ్యాధులు నివారణ చర్యలు చేపట్టాలని.. రెండు నెలల్లో డెంగీ కేసులు మరిన్ని పెరిగే చాన్స్ ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
గత నాలుగేళ్లుగా డెంగీ కేసులు పరిశీలిస్తే 2017 సంవత్సరంలో 410 మందికి, 2018లో 263 మందికి సోకగా, 2019లో 1406 మంది, 2020లో 100లోపు నమోదయ్యయాని గణాంకాలు ద్వారా తెలుస్తోంది. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలుంటే వెంటనే సమీపంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడంతో స్టిట్ టెస్టులు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రులైన ఉస్మానియా, గాంధీ, టిమ్స్ ఆసుపత్రుల్లో డెంగు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.