హైదరాబాద్: చంచల్గూడ జైలులో ఉగ్రకుట్ర జరుగుతోందంటూ వస్తున్న వార్తలపై జైళ్ల శాఖ డీఐజీ డి.శ్రీనివాస్ స్పష్టతనిచ్చారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కేవలం వదంతులేనని ఆయన కొట్టిపారేశారు. చంచల్గూడ జైలులో ఉగ్రవాద సంబంధిత వ్యక్తులు 'ములాఖత్' నిర్వహించి నగరంలో దాడులకు ప్లాన్ చేస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరిగింది.
దీనిపై స్పందించిన డీఐజీ.. అటువంటి సంఘటనలు ఏవీ జరగలేదని స్పష్టం చేశారు. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన విషయాలను ప్రసారం చేసేటప్పుడు బాధ్యతాయుతమైన మీడియా సంస్థలు కనీస ధృవీకరణ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాస్తవాలను తెలుసుకోకుండా తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి భయాందోళనలు సృష్టించవద్దని కోరారు.