లండన్లో హైదరాబాద్ వాసి దారుణ హత్య
ఒకవైపు కూతురు వివాహం అంగరంగ వైభవంగా జరపడానికి సన్నాహాలు జరుగుతూ ఉంటే.. మరోవైపు తండ్రి మరణ వార్త.. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నిండుకున్నాయి.
By అంజి Published on 3 Oct 2023 12:34 PM IST
లండన్లో హైదరాబాద్ వాసి దారుణ హత్య
ఒకవైపు కూతురు వివాహం అంగరంగ వైభవంగా జరపడానికి సన్నాహాలు జరుగుతూ ఉంటే.. మరోవైపు తండ్రి మరణ వార్త.. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నిండుకున్నాయి. హైదరాబాద్కు చెందిన మహమ్మద్ ఖాజా రయీస్ ఉద్దీన్ (65) అనే వ్యక్తి 2011 లో ఉపాధి నిమిత్తం లండన్కి వెళ్లి అక్కడే నివాసం ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి భార్య, ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. లండన్లోని వెస్ట్ యార్క్ షైర్లోని హిల్ టాప్ మౌంట్ లీడ్స్ వద్ద గుర్తు తెలియని కొందరు దుండగులు అతన్ని అత్యంత దారుణంగా హత్య చేశారు. లండన్లో ఉగాండా జాతీయులతో గొడవ జరిగిన అనంతరం గుర్తుతెలియని దుండగులు ముందుగా మహమ్మద్ ఖాజా కదలికలను రెక్కి నిర్వహించారు.
అనంతరం మహమ్మద్ ఖాజా తన స్నేహితులతో కలిసి వెళుతుండగా అదే అదునుగా భావించిన దుండగులు ఒక్కసారిగా కత్తితో అటాక్ చేసి విచక్షణారహితంగా పొడించి హత్య చేశారు. అనంతరం దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. హైదరాబాద్కు చెందిన మహమ్మద్ ఖాజా తోపాటు అతని స్నేహితులు కూడా మరణించినట్లు ప్రాథమిక సమాచారం. మహమ్మద్ ఖాజా కూతురి వివాహం ఈనెల అక్టోబర్ 5 తేదీన జరగనున్నది. ఇందు కొరకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే సమయంలో మహమ్మద్ ఖాజా మరణించాడన్న వార్త తెలియడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మహమ్మద్ ఖాజా మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ని కుటుంబ సభ్యులు అభ్యర్థించారు. తన కూతురు పెళ్లి ఘనంగా చేయాలని అనుకున్న ఆ తండ్రి హైదరాబాద్కు వద్దామనుకున్న సమయంలో హత్యకు గురి కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపిస్తున్నారు. ఈ కుటుంబానికి సాయం అందించాలని.. ఎంబీటీ నేత అంజదుల్లా విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ను అభ్యర్థించారు.