జల ప్రవేశం చేసిన ఖైరతాబాద్ రుద్రగణపతి
Khairatabad Ganesh Immersion Completed. ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం పూర్తయింది. పంచముఖ మహా రుద్రగణపతి హైదరాబాదు
By Medi Samrat
ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం పూర్తయింది. పంచముఖ మహా రుద్రగణపతి హైదరాబాదు ట్యాంక్ బండ్ వద్ద జలప్రవేశం చేశాడు. భారీ కొక్కేలకు తగిలించిన వినాయకుడిని నిదానంగా హుస్సేన్ సాగర్ నీటిలోకి దించారు. విగ్రహం పూర్తిగా మునగడంతో నిమజ్జనం పూర్తయింది. ఆ భారీ గణపయ్య ఎలాంటి అవాంతరాలు లేకుండా గంగమ్మ ఒడికి చేరడంతో అధికారులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసరాలు క్రిక్కిరిసిపోయాయి. భక్తులు భారీ ఎత్తున తరలిరావడంతో ఈ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. ఖైరతాబాద్ గణపతిని ట్యాంక్ బండ్ పై ఉన్న క్రేన్-4 ద్వారా నిమజ్జనం చేశారు.
40 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పుతో కాళనాగేశ్వరి, శ్రీకృష్ణకాళ సమేతంగా కొలువుదీరిన మహాగణపతి శోభయాత్ర ఖైరతాబాద్ నుంచి టెలిఫోన్ భవన్ మీదుగా ట్యాంక్బండ్ వరకు సాగింది. ఇక్కడ చివరిసారిగా నిర్వాహకులు పంచముఖ రుద్ర మహాగణపతికి పూజలు నిర్వహించారు. అనంతరం నాలుగో నంబర్ క్రేన్ ద్వారా మహాగణపతిని హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేశారు. వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం 8.18 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్లో యాత్ర ప్రారంభం కాగా.. సుమారు 6 గంటల పాటు శోభాయాత్ర కొనసాగింది. నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.