మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వాహనదారుల పట్ల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా వారి వ్యవహార శైలిలో మార్పు రావడం లేదు. ఒక్క వారంలోనే 1,062 మంది వాహనదారులు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు కావడం విశేషం. పట్టుబడిన మొత్తం నేరస్తుల్లో 918 మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. అలాగే.. 45 మంది త్రీవీలర్ డ్రైవర్లు, 98 మంది ఫోర్ వీలర్ డ్రైవర్లు, ఒక హెవీ వెహికల్ ఆపరేటర్ పట్టుబడ్డారు.
మద్యం తాగి నిబంధనలు ఉల్లంఘించినవారికి పోలీసులు నిర్వహించిన టెస్టులలో మత్తు వివిధ స్థాయిలలో నమోదు అయ్యింది. 196 మంది 30-50 mg/100ml మధ్య BAC స్థాయిలను కలిగి ఉండగా, 463 మందికి 51-100 mg/100ml మధ్య నమోదు అయినట్లు వెల్లడించారు.
వీరితో పాటు హైదరాబాద్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన మరో 226 మందికి 101-150 ఎంజీ/100 ఎంఎల్.. 112 మంది వ్యక్తులకు 151-200 mg/100ml వరకు BAC స్థాయిలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.
పట్టుబడిన వారిలో మహిళా డ్రైవర్ కూడా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు నేరస్తులందరికీ కౌన్సెలింగ్ సెషన్లను తప్పనిసరి చేశారు, వారు న్యాయపరమైన విచారణలో భాగంగా కోర్టుకు హాజరు కావాలి.