Hyderabad: బోనాల జాతరలో మహిళలను వేధించిన 117 మంది అరెస్ట్‌

మహిళా భక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన 117 మంది వ్యక్తులను నగర పోలీసులకు చెందిన షీ టీమ్స్ అధికారులు గత రెండు రోజులుగా పట్టుకున్నారు.

By అంజి  Published on  25 July 2024 2:07 AM GMT
Hyderabad, SHE Teams, harassing, women, Bonalu

Hyderabad: బోనాల జాతరలో మహిళలను వేధించిన 117 మంది అరెస్ట్‌

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో ఆదివారం, జూలై 21 నుంచి జూలై 22 మధ్య జరిగిన ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు హాజరైన మహిళా భక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన 117 మంది వ్యక్తులను నగర పోలీసులకు చెందిన షీ టీమ్స్ అధికారులు గత రెండు రోజులుగా పట్టుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఈ వ్యక్తులను బాధ్యులను చేస్తున్నామని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. పట్టుబడిన ప్రతివాదులను తదుపరి చట్టపరమైన విచారణల కోసం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు.

ప్రధాన సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమం అయిన బోనాల పండగ సందర్భంగా.. మహిళా భక్తులకు సురక్షితమైన వాతావరణం ఉండేలా నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, దానికి భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా సహించేది లేదని పేర్కొన్నారు.

అంతకుముందు, నుమాయిష్ 83వ ఎడిషన్ సందర్భంగా.. హైదరాబాద్ పోలీసు షీ టీమ్స్ అధికారులు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన 117 మంది పెద్దలు, 6 మైనర్లతో సహా మొత్తం 123 మంది నేరస్థులను పట్టుకున్నారు. దోషులుగా తేలిన వారిలో నలుగురికి నాలుగు రోజులు, పది మందికి మూడు రోజులు, మిగిలిన 41 మందికి రెండు రోజుల జైలు శిక్ష విధించబడింది.

ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నట్టు గమనిస్తే వెంటనే 9490616555లో వాట్సాప్ ద్వారా చెప్పాలని షీ టీమ్‌లు సాధారణ ప్రజలను కోరాయి. ప్రజల భద్రతను నిర్ధారించడానికి, అవసరమైన వారికి సత్వర సహాయం అందించడానికి హెల్ప్‌లైన్ 24/7 అందుబాటులో ఉంటుంది. 2014 అక్టోబరు 24న హైదరాబాద్‌లో షీ టీమ్‌ ప్రారంభమైంది. ఏడాది తర్వాత తెలంగాణలోని ప్రతి జిల్లాలో షీ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 331 షీ టీమ్స్ పని చేస్తున్నాయి. ఇది తెలంగాణ పోలీసుల ప్రత్యేక మహిళా భద్రతా విభాగం. మహిళలపై వేధింపులకు సంబంధించిన అనేక కేసులు నమోదైన ప్రాంతాల్లో ఈ యూనిట్లు గస్తీ నిర్వహిస్తాయి.

Next Story