Hyderabad: పోలింగ్‌కు సిద్ధమవుతున్న పోలీసులు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2023లో బోగస్ ఓటింగ్ జరగకుండా హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఎన్నికల సంఘం సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

By అంజి  Published on  22 Nov 2023 7:08 AM GMT
Hyderabad, police , polling , Telangana

Hyderabad: పోలింగ్‌కు సిద్ధమవుతున్న పోలీసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2023లో బోగస్ ఓటింగ్ జరగకుండా హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఎన్నికల సంఘం సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఎన్నికల్లో దాదాపు 600 పోలింగ్‌ కేంద్రాల్లో బోగస్‌ ఓటింగ్‌ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అటువంటి పోలింగ్ స్టేషన్‌లో ఎన్నికల సంఘం అధికారులు బూత్‌ల వెలుపల కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.

గత ఎన్నికలలో అధిక సంఖ్యలో గైర్హాజరైన, మారిన ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్‌ల జాబితా ఎన్నికల అధికారుల వద్ద అందుబాటులో ఉంది. క్లిష్టమైన, సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్‌లను గుర్తించడంలో సహాయపడటానికి పోలీసులతో భాగస్వామ్యం చేయబడింది. ఏర్పాటు చేసిన క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు 200 మీటర్ల దూరాన్ని కవర్ చేయగలవని, ఎన్నికల కంట్రోల్ రూమ్ నుండి రియల్ టైమ్ ప్రాతిపదికన పర్యవేక్షించబడతాయని హైదరాబాద్ పోలీసు సీనియర్ అధికారి తెలిపారు.

అలాంటి పోలింగ్ కేంద్రాల వద్ద బోగస్ ఓటింగ్‌ను నిరోధించేందుకు మహిళా పోలీసులు, సెంట్రల్ పోలీస్ ఫోర్స్‌ను మోహరిస్తారు. ఎవరైనా బోగస్ ఓటింగ్‌కు పాల్పడితే కేసులు నమోదు చేయబడతాయి. ఎన్నికల రోజు నగరంలో 300 పోలీసు పికెట్లు, వాహనాల తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్ వంటి ప్రత్యేక బృందాలు గస్తీ తిరుగుతాయి. సున్నితమైన పాయింట్ల వద్ద మోహరించబడతాయి.

ఎన్నికల ఏజెంట్లు తరచూ పోలింగ్ బూత్‌లలోకి వెళ్లేందుకు, బయటకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించరు. కీలకమైన పోలింగ్ కేంద్రాలపై సివిల్ పోలీసులు నిఘా ఉంచుతారు. పోలింగ్ రోజున ఎవరినీ గుంపులు గుంపులుగా, ఊరేగింపులకు పోలీసులు అనుమతించరని అధికారి తెలిపారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణలోని 33 జిల్లాల్లో చాలా వరకు 'ఇంటింటికి ఓటింగ్' ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 26 నాటికి పూర్తవుతుంది. ''నవంబర్ 21, మంగళవారం నుంచి చాలా జిల్లాల్లో ఇంటింటి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మిగతా వారందరినీ కవర్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. నవంబర్ 26 నాటికి పూర్తవుతుంది. ఇంటి వద్దే ఓటు వేసిన ఓటర్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారికి ఇలాంటి సదుపాయం కల్పించినందుకు ఈసీ ప్రయత్నాలను అభినందించారు ”అని మంగళవారం రాత్రి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ తెలిపారు.

Next Story