హైదరాబాద్: తాను షాపులో కొనుగోలు చేసిన ప్యాకెట్ పాలను వేడి చేయగా.. పగిలిపోయాయని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఈ ఈ ఘటన నగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కూకట్పల్లి పీఎస్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వ్యక్తి.. ఈ నెల 22వ తేదీన తనకు దగ్గరలో ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్లో రెండు హెరిటేజ్ పాల ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. పాల ప్యాకెట్లను ఇంటికి తెచ్చిన కాచగా ఒక ప్యాకెట్ బాగానే ఉండగా.. మరో ప్యాకెట్ పాలను కాచేసరికి పగిలిపోయాయి.
ఈ క్రమంలోనే సదరు వ్యక్తి రత్నదీప్ స్టోర్కి వెళ్లి అక్కడి సిబ్బందిని ప్రశ్నించాడు. దీనికి మేం ఏం చేస్తాం అంటూ సిబ్బంది జవాబు ఇచ్చారు. దీంతో ఆ వ్యక్తి నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా కేవలం ఒక కంపెనీ నుండి వచ్చే పాలే కాకుండా ఈ మధ్యకాలంలో పలు కంపెనీల పాలు పగులుతున్నాయని, వాసన వస్తున్నాయని వినికిడి కూడా ఎక్కువగా ఉంది. వీటిపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలని ఎంతోమంది వినియోగదారులు కోరుకుంటున్నారు.