ఎదుటి వ్యక్తి మొదట దాడి చేస్తూ ఉంటాడు.. అలాంటి సమయంలో మనం తప్పకుండా ప్రతిఘటించాల్సి ఉంటుంది. ఇలా ప్రతిఘటించకపోతే మన ప్రాణాలకే ప్రమాదం. ఇక ఆడవారి మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా వారి మీద దాడి చేసినా.. అత్యాచార యత్నానికి ప్రయత్నించినా ప్రతిఘటించాల్సిందే.. అందుకే అమ్మాయిలు ఆత్మరక్షణ కోసం ఎవరినైనా చంపేయొచ్చని చెబుతూ ఉన్నారు. ఆత్మ రక్షణ కోసం అమ్మాయిలు ఎవరినైనా చంపొచ్చని, అది వాళ్లకు చట్టం కల్పిస్తున్న హక్కుల్లో ఒకటని మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (ఎంఎల్ఎస్ఏ) కార్యదర్శి ఎం రాధాకృష్ణ చౌహాన్ గుర్తు చేశారు.
చట్టంలో చెప్పిన దాని ప్రకారం ఆత్మరక్షణ కోసం ఎవరినైనా ఓ అమ్మాయి చంపేస్తే అది నేరం కాబోదని.. హైదరాబాద్ గోల్కొండలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. బాలికలు ఎప్పుడూ తమ వెంట పెప్పర్ స్ప్రేను తీసుకెళ్లాలని.. వివిధ రంగాలకు చెందిన గొప్ప గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవాలని అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఏమాత్రం తీసిపోరని అన్నారు. అలాగే బాలికలు, మహిళలకు రక్షణగా నిలుస్తున్న కొన్ని చట్టాలను ఆయన వివరించారు.