సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆదివారం భారీగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మహిళలను రైల్వే పోలీసులు (GRP, RPF) అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పంచాది రుక్మిణి (56), సెట్టి కాసులమ్మ (44) గోదావరి ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ చేరుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 3.93 లక్షల విలువైన 7.866 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల అదే జిల్లాకు చెందిన ఈశ్వర్ రావు అనే స్మగ్లర్ కోసం కేవలం రూ. 5,000 కూలీ కోసం ఈ అక్రమ రవాణాకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ వీరు పలు రాష్ట్రాలకు గంజాయి తరలించినట్లు తేలింది. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఈశ్వర్ రావు కోసం పోలీసులు గాలిస్తున్నారు.