బోయిగూడలోని టింబర్ డిపోలో భారీ అగ్నిప్ర‌మాదం.. ఐదుగురు స‌జీవ ద‌హ‌నం

Fire Accident in Timber Depot in Secunderabad five dead. టింబ‌ర్ డిపోలో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 March 2022 2:11 AM GMT
బోయిగూడలోని టింబర్ డిపోలో భారీ అగ్నిప్ర‌మాదం.. ఐదుగురు స‌జీవ ద‌హ‌నం

ఓ టింబ‌ర్ డిపోలో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు స‌జీవ ద‌హ‌నం అయ్యారు. వివ‌రాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ న‌గ‌రంలోని బోయిగూడలోని టింబ‌ర్ డిపోలో ఈ రోజు(బుధ‌వారం) తెల్ల‌వారుజామున ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. అక్క‌డ ఉన్న చెక్క‌ల‌కు, క‌ట్టెల‌కు విస్త‌రించ‌డంతో భారీగా మంట‌లు ఎగిసిప‌డ్డాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది 8 ఫైరింజ‌న్‌ల‌తో ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

దాదాపు గంట పాటు శ్ర‌మించి మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో టింబ‌ర్ డిపోలో 10 మంది వ‌ర‌కు ఉన్న‌ట్లు తెలుస్తోంది. వారిలో ఐదుగురు స‌జీవ ద‌హ‌నం కాగా.. మ‌రో ఇద్ద‌రు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఇంకో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీస్తున్నారు. జ‌నావాసాల‌కు స‌మీపంలోనే ఉవ్వెత్తున్న మంట‌లు ఎగిసిప‌డ‌డంతో స్థానికులు భ‌యాందోళ‌న వ్య‌క్తం చేశారు. షార్ట్ స‌ర్య్కూట్ కార‌ణంగానే మంట‌లు చెల‌రేగిన‌ట్లు తెలుస్తోంది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story