గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అత్యవసర విభాగం వద్ద పార్కింగ్ చేసిన అంబులెన్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనం నుంచి మంటలు వ్యాపించడంతో రోగులు, రోగుల బంధువులు భయాందోళనకు గురై అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. మంటలను గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది.
అగ్నిప్రమాదంతో ఏఐజీ ఆస్పత్రి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడకు చేరుకుని 30 నిమిషాల పాటు శ్రమించి పూర్తిగా ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఇదే ఆస్పత్రిలో గత కొద్దిరోజులుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చికిత్స పొందుతున్నారు.