హైదరాబాద్: సృష్టి సరోగసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన ఉచ్చును బిగిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతకు షాక్ ఇస్తూ, ఆమెకు చెందిన సుమారు రూ. 50 కోట్ల విలువైన స్థిరాస్తులను అధికారులు తాత్కాలికంగా అటాచ్ చేశారు. 2014 నుంచే సరోగసీ ముసుగులో ఈ భారీ నెట్వర్క్ కొనసాగుతున్నట్లు ఈడీ గుర్తించింది.
కేవలం సరోగసీ మాత్రమే కాకుండా, గిరిజన తండాల నుంచి చిన్నారులను కొనుగోలు చేసి, వారిని సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డలుగా నమ్మించి విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. సంతానం లేని దంపతుల బలహీనతను ఆసరాగా చేసుకుని, లక్షల రూపాయలను వసూలు చేస్తూ వందల కోట్ల అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం జరిపిన రూ. 50 కోట్ల ఆస్తుల అటాచ్మెంట్ కేవలం ఆరంభం మాత్రమేనని తెలుస్తోంది. ఈ నెట్వర్క్తో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై, అలాగే విదేశీ లావాదేవీలేవైనా ఉన్నాయా అనే కోణంలో ఈడీ లోతుగా విచారణ జరుపుతోంది. మరిన్ని ఆస్తులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుండటంతో, త్వరలోనే మరికొంతమందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.