రేపటి నుండి మరింత కఠినంగా లాక్డౌన్ : సీపీ సజ్జనార్
CP Sajjanar Alert Hyderabad People. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ 19వ రోజుకు చేరింది. రాష్ట్ర క్యాబినెట్ లాక్ డౌన్
By Medi Samrat Published on 31 May 2021 1:00 PM GMT
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ 19వ రోజుకు చేరింది. రాష్ట్ర క్యాబినెట్ లాక్ డౌన్ సడలింపు సమయాన్ని పెంచుతూ ఆమోదం తెలపడంతో ఈరోజు నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. లాక్డౌన్ నేఫథ్యంలో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అనవసరంగా రోడ్లపైన తిరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన నేపథ్యంలో కూకట్ పల్లి జెఎన్టియు చెక్ పోస్ట్, వై జంక్షన్, సనత్ నగర్, బాలానగర్ వద్ద సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సమక్షంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ప్రతి ఒక్క షాప్, ఆఫీసులు మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసివేయాలన్నారు. రేపటి నుండి లాక్ డౌన్ మరింత కఠినంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. గూడ్స్ వెహికల్స్ రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. అలా కాకుండా అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు.
జిహెచ్ఎంసి పరిధిలో పెట్రోల్ బంకులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెరచి ఉంటాయని స్పష్టం చేశారు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయలకు, రిజిస్ట్రేషన్ కోసం వెళ్లే వారు స్లాట్ సరైన సమయానికి బుక్ చేసుకుని.. దానికి సంబంధించిన పత్రాలు చూపించి వెళ్ళాలి అని అన్నారు. ప్రజలందరూ తమకు సహకరించాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.