సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోనచన దినోత్సవం.. కేంద్రం నోటిఫికేషన్
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'గా జరుపుకోవాలని కేంద్రం మంగళవారం ప్రకటించింది.
By అంజి Published on 13 March 2024 6:35 AM IST
సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోనచన దినోత్సవం.. కేంద్రం నోటిఫికేషన్
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'గా జరుపుకోవాలని కేంద్రం మంగళవారం ప్రకటించింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్కు 13 నెలల వరకు స్వాతంత్ర్యం రాలేదని, నిజాంల పాలనలో ఉందని కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. సెప్టెంబర్ 17, 1948న 'ఆపరేషన్ పోలో' అనే పోలీసు చర్య తర్వాత ఈ ప్రాంతం నిజాం పాలన నుండి విముక్తి పొందింది.
అయితే, ''సెప్టెంబర్ 17ని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని ఈ ప్రాంత ప్రజల నుండి డిమాండ్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకోవడానికి, యువతలో దేశభక్తి జ్వాలలను నింపడానికి, భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'గా జరుపుకోవాలని నిర్ణయించింది.'' అని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, రజాకార్లు హైదరాబాద్ రాష్ట్రాన్ని పాకిస్తాన్లో చేరాలని, భారత యూనియన్లో విలీనాన్ని ప్రతిఘటిస్తూ ముస్లిం ఆధిపత్యంగా మారాలని పిలుపునిచ్చారు.
ఈ ప్రాంతాన్ని భారత యూనియన్లో విలీనం చేసేందుకు రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంత ప్రజలు ధైర్యంగా పోరాడారు. రజాకార్లు, ప్రైవేట్ మిలీషియా, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. హైదరాబాద్లో ఒకప్పటి నిజాం పాలనను సమర్థించారు. సెప్టెంబరు 17, 1948న అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో సైనిక చర్యతో నిజాంల పాలనలో ఉన్న అప్పటి హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో విలీనమైంది. 'హైదరాబాద్ విమోచన దినోత్సవం' సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు.