సత్ఫలితాలిస్తోన్న 'సీ-మిత్ర'.. పది రోజుల్లోనే 1000 మంది బాధితులకు ఫోన్ కాల్స్..!

సైబర్ నేర బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు హైదరాబాద్ పోలీసులు చేపట్టిన వినూత్న కార్యక్రమం 'సీ-మిత్ర' సత్పలితాలను ఇస్తోంది

By -  Medi Samrat
Published on : 19 Jan 2026 8:46 PM IST

సత్ఫలితాలిస్తోన్న సీ-మిత్ర.. పది రోజుల్లోనే 1000 మంది బాధితులకు ఫోన్ కాల్స్..!

సైబర్ నేర బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు హైదరాబాద్ పోలీసులు చేపట్టిన వినూత్న కార్యక్రమం 'సీ-మిత్ర' సత్పలితాలను ఇస్తోంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ఈ విధానం.. అమల్లోకి వచ్చిన కేవలం పది రోజుల్లోనే వందల మందికి భరోసానిచ్చింది. ఈ స్వల్ప వ్యవధిలో సీ-మిత్ర బృందం 1000 మంది బాధితులకు స్వయంగా ఫోన్ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. రోజుకు సగటున 100 ఫోన్ కాల్స్ చేస్తున్నారు. బాధితుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో 200 మందికి పక్కాగా ఫిర్యాదు డ్రాఫ్ట్‌లను సిద్ధం చేసి పంపింది. వారి నుంచి సంతకం చేసిన ప్రతులు అందగానే.. ఎక్కడా జాప్యం లేకుండా 100 కిపైగా ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారు. గంటల తరబడి స్టేషన్లలో పనిలేకుండా, నిమిషాల్లోనే వర్చువల్ పోలీసులు స్పందిస్తుండటం, ఎఫ్ఐఆర్ కాపీలు నేరుగా మొబైల్‌కే వస్తుండటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇంటి నుంచే ఫిర్యాదు.. ఫోన్ కు ఎఫ్ఐఆర్ కాపీ

సైబర్ నేర బాధితులు 1930 నంబరుకు లేదా జాతీయ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. ఆ వెంటనే 'సీ-మిత్ర' బృందం రంగంలోకి దిగుతుంది. బాధితులకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీసి, ఏఐ సాంకేతికతతో లీగల్ అంశాలతో కూడిన పక్కా ఫిర్యాదు డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసి వాట్సాప్ లేదా మెయిల్‌కు పంపిస్తారు. బాధితులు ఆ ఫిర్యాదును ప్రింట్ తీసుకొని, సంతకం చేసి బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ స్టేషన్‌కు కొరియర్ లేదా పోస్ట్ ద్వారా పంపాలి. ఆ కాపీ అందగానే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ వివరాలను బాధితుల మొబైల్‌కే మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు.

సీ-మిత్ర సేవలను వేగంగా బాధితులకు అందించేందుకు 24 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని సైబర్ క్రైం విభాగం ఏర్పాటు చేసింది. రెండు షిప్ట్ ల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ 'వర్చువల్ హెల్ప్‌డెస్క్' బాధితులకు అందుబాటులో ఉంటుంది.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ నేర బాధితులకు ఇబ్బందులు కలగకుండా సత్వర న్యాయం అందించాలనే ఉద్దేశంతో వినూత్న కార్యక్రమం సీ-మిత్రను జనవరి 9వ తేదిన నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ప్రారంభించారు.

పోలీసులా కాదు.. ఒక సోదరిలా.! : దీక్షిత, మహిళా కానిస్టేబుల్

సాధారణంగా మోసపోయామన్న బాధలో ఉన్నవారు పోలీస్ స్టేషన్‌కు రావాలంటేనే భయపడతారు. కానీ, మేమే స్వయంగా ఫోన్ చేసి.. 'భయపడకండి, మీకు న్యాయం చేయడానికి మేమున్నాం' అని చెప్పగానే వారి గొంతులో కనిపించే ధైర్యం వెలకట్టలేనిది. ఒకప్పుడు స్టేషన్ కు రావాలంటే ఆలోచించే సామాన్యుడికి, పోలీసులకు మధ్య 'సీ-మిత్ర' ఒక బలమైన వారధిలా నిలిచింది. నేను ప్రతి రోజు 20 మంది బాధితులకు ఫోన్ చేస్తా. ఒక సోదరిలా వారి సమస్యను విని, ఇంటి నుంచే ఫిర్యాదు తీసుకుంటున్నప్పుడు బాధితులు చూపిస్తున్న కృతజ్ఞత మా బాధ్యతను మరింత పెంచుతోంది.

భవిష్యత్తులో 'సీ-మిత్ర' బంద్ అవ్వాలన్నదే మా లక్ష్యం : పృథ్వీక, మహిళా కానిస్టేబుల్

టెక్నాలజీని, మానవతా దృక్పథాన్ని జోడించి హైదరాబాద్ పోలీస్ సృష్టిస్తున్న ఈ 'డిజిటల్ విప్లవం'లో.. ప్రజలకు ఇంత వేగంగా సేవలందిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. గతంలో సైబర్ మోసం జరిగితే.. ఫిర్యాదు ఎలా రాయాలి? ఏ సెక్షన్లు వర్తిస్తాయి? అని తెలియక బాధితులు సతమతమయ్యేవారు. కానీ 'సీ-మిత్ర'తో ఆ ఇబ్బందులు ఇప్పుడు లేవు. బాధితుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫోన్ చేసి వివరాలు అడగానే సానుకూలంగా స్పందించి.. అన్ని వివరాలు తెలియజేస్తున్నారు. భవిష్యత్ లో హైదరాబాద్ లో ఒక్క సైబర్ బాధితుడు కూడా లేకుండా చేసి.. సీ-మిత్ర బంద్ అయ్యే విధంగా మేమంతా పనిచేస్తున్నాం.

Next Story