హైదరాబాద్: ఫాల్కన్ యాప్ మోసం కేసులో సీఐడీ దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో ఫాల్కన్ యాప్ COO వికాస్ కుమార్ సఖేర్ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికి వేలాది మంది నుంచి డబ్బులు సేకరించినట్టు విచారణలో వెల్లడైంది. మల్టీనేషనల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి వచ్చిన లాభాలను పంచుతామని చెప్పి డిపాజిటర్లను మోసం చేసినట్టు అధికారులు గుర్తించారు.
ఫాల్కన్ గ్రూప్ మొత్తం 7,056 మంది డిపాజిటర్ల నుంచి రూ.4,215 కోట్ల వరకు సేకరించినట్టు సమాచారం. అందులో 4,065 మంది బాధితులను రూ.792 కోట్ల మేర మోసం చేసినట్టు కేసు నమోదైంది. ఇప్పటికే ఈ స్కాంలో ప్రధాన నిందితులైన ఫాల్కన్ చైర్మన్, సీఈఓలను సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజా అరెస్ట్తో ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు బయటకు వచ్చే అవకాశముంది. సీఐడీ అధికారులు నిందితులను విచారిస్తూ డబ్బుల మార్గాలను గుర్తించే పనిలో ఉన్నారు.