హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసకుంది. రోడ్డు ప్రమాదంలో అడిషనల్ డిప్యూటీ ఎస్పీ బాబ్జీ మృతి చెందారు. ఇవాళ ఉదయం సమయంలో బాబ్జీని అటుగా వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. హయత్నగర్ పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెం వద్ద బాబ్జీ వాకింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో బాబ్జీ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు.
ఈ రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో బాబ్జీ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ డీజీపీ ఆఫీసులో బాబ్జీ విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో నగరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్తో వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఈ ప్రమాదాలతో అభం శుభం తెలియని వారు ప్రాణాలను వదులుతున్నారు. మరికొందరు గాయాలపాలవుతున్నారు.