సికింద్రాబాద్‌లోని హోటల్‌లో అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

By అంజి  Published on  2 July 2023 7:56 AM GMT
fire, hotel, Secunderabad, Hyderabad

సికింద్రాబాద్‌లోని హోటల్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ రెజిమెంటల్‌ బజార్‌లోని ఓ హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం కారణంగా ఘటనా స్థలంలో దట్టమైన పొగ కమ్ముకుంది. సిబ్బంది కట్టెల పొయ్యి మీద వంట చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. పక్కనే ఉన్న వంట సామాగ్రిపై నూనె పడి ఉండటంతో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

పోలీసులు హోటల్‌లో ఉన్న వారిని బయటకు తరలించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. కాగా అధికారులు ఇప్పటికైనా స్పందించి.. తగిన అనుమతులు, ఫైర్‌ సెఫ్టీ లేని హోటళ్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఏపీలోని అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని అచ్యుతాపురం సెజ్‌లోని సాహితీ ఫార్మాలో పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు చెల‌రేగాయి. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరగడంతో విధుల్లో ఉన్న కార్మికులు తీవ్ర భయాందోళనల‌కు గురై అక్కడ నుంచి పరుగులు తీశారు.

Next Story