డయల్ 100కు సమాచారం అందించిన ఏడు నిమిషాల్లోనే స్పందించిన పోలీసులు
By Newsmeter.Network Published on 6 Dec 2019 7:05 AM GMTడయల్ 100కు సమాచారం అందిన ఏడు నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుకున్న పోలీసులు ఉరికి వేలాడుతున్న వ్యక్తిని సురక్షితంగా కాపాడిన సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. డీఐ సంజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం...చిలకలగూడలో అక్బర్ఖాన్ (45) వహిదాబేగం దంపతులు నివాసం ఉంటున్నారు. అక్బర్ఖాన్ కార్పెంటర్గా పని చేస్తున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం కూడా వారి మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగాయి. మద్యం మత్తులో ఉన్న అక్బర్ ఖాన్ భార్య వహీదా బేగంపై దాడి దిగాడు. దీంతో వెంటనే ఆమె డయల్ 100కు సమాచారం అందించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అక్బర్ఖాన్ గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పటికే సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు క్షణాల్లో స్పందించారు. పెట్రోకార్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కిరణ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. తలుపులు కొట్టినా స్పందన లేకపోవడంతో కిటికీలో నుంచి చూడగా అక్బర్ఖాన్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. అప్రమత్తమైన కిరణ్కుమార్ తలుపులను గట్టిగా తన్నడంతో తలుపులు తెరుచుకున్నాయి. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అక్బర్ఖాన్ను కిందికి దించి ప్రాథమిక చికిత్స అందించాడు. అనంతరం అతడిని 108 అంబులెన్స్లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఓ వ్యక్తిప్రాణా లు కాపాడిన కానిస్టేబుల్ కిరణ్కుమార్తోపాటు తక్షణ మే స్పందించిన చిలకలగూడ డీఐ సంజయ్కుమార్ను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. సమాచారం అందుకున్న ఏడునిమిషాల్లోనే పోలీసులు స్పందించడం, పైగా అక్బర్ ఖాన్ ప్రాణాలతో బతకడంతో జనాలు ప్రశ్నంసలు కురిపిస్తున్నారు.
పోలీసులు ఎలా స్పందించారు...
అక్బర్ఖాన్ తనపై దాడి చేస్తున్నాడని అతడి భార్య వహీదాబేగం గురువారం అర్ధరాత్రి 12 గంటల 38 నిమిషాల 37 సెకెన్లకు డయల్ 100కు ఫిర్యాదు చేసింది. నిమిషంలోనే కాల్ను యాక్సెప్ట్ చేసిన సిబ్బంది చిలకలగూడ పోలీసులకు సమాచారం అందించారు. 12 గంటల 45 నిమిషాల 26 సెకెన్లకు అంటే ఫిర్యాదు చేసిన ఏడు నిమిషాల్లోనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అత్మహత్యాయత్నానికి పాల్పడిన అక్బర్ఖాన్ను కాపాడారు.
సంఘటన స్థలానికి డీఐ సంజయ్కుమార్
ఈ విషయమై చిలకలగూడ సీఐ సంజయ్కుమార్, ఎస్ఐలు రాజశేఖర్, విజయేందర్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో కోలుకున్న అక్బర్ఖాన్తోపాటు అతని కుటుంబసభ్యులు, బంధువులకు అడ్మిట్ఎస్ఐ రవికుమార్ కౌన్సెలింగ్ ఇచ్చారు.